
నల్లా పన్ను బకాయిలు వసూలు చేయాలి
● అధికారుల సమీక్షలో నగర మేయర్
గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: నల్లా పన్నుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఆర్ఓలు, ఆర్ఐలతో నల్లా పన్ను బకాయిల వసూళ్లపై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నల్లా బకాయిల వసూళ్ల లక్ష్యం రూ.45 కోట్లు ఉందని తెలిపారు. ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి వసూలు చేయాలని పేర్కొన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి సుమారు 12 శాతం అధిక లక్ష్యాన్ని సాధించాలని సీడీఎంఏ నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. పెద్ద మొత్తంలో బకాయి ఉన్న 150 మంది జాబితా తయారు చేయాలని సూచించారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఆర్ఓ లు షెహజాది బేగం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విగ్రహాల అమ్మకాలు నిషేధం..
రోడ్ల పక్కన దేవతామూర్తుల విగ్రహాల అమ్మకాలు నిషేధమని అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నందున బల్దియా పరిధిలో రోడ్ల పక్కన దేవతామూర్తుల విగ్రహాలు అమ్మడం నిషేధమని పేర్కొన్నారు. వరంగల్ నగరానికి సంబంధించి ఉర్సు రంగలీల మైదానం, హయగ్రీవాచారి గ్రౌండ్ ప్రాంతాల్లో అమ్మకాలు జరుపుకోవాలని తెలిపారు.