
కారు ఢీకొని రైతు మృతి
గీసుకొండ : మోపెడ్పై పొలం వద్దకు వెళ్తున్న రైతును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని దస్రు తండాకు చెందిన రైతు ఆంగోత్ దస్రు (60) శనివారం మధ్యాహ్నం తన మోపెడ్ (వాహనం)పై వెళ్తున్నాడు. వరంగల్–నర్సంపేట రహదారిపై మూల ములుపు తిరిగే క్రమంలో వెనక నుంచి (వరంగల్ వైపు) అతివేగంగా వచ్చిన కారు దస్రు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అతడు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే వేగంతో కారు మోపెడ్ను ముందుకు తోసుకుంటూ వంద మీటర్ల దూరం వరకు వెళ్లగా మంటలు చెలరేగి మోపెడ్ దగ్ధమైంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని గీసుకొండ ఎస్సైలు కుమార్, ప్రశాంత్ సందర్శించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కుమార్ తెలిపారు.