వనపర్తి రూరల్: విద్యుత్, వ్యవసాయం, ప్రాజెక్టులు, నదీజలాలు, వివిధ రంగాలపై అపార అనుభవం కలిగిన సారంపల్లి మల్లారెడ్డి దేశానికి ఒక విజ్ఞాన గని అని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ కొనియాడారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని లిటిల్బర్డ్స్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరాడంబర జీవితం గడిపిన మల్లారెడ్డి మరణం ఉద్యమాలకు తీరని లోటని, అసమానతలు లేని సమాజ స్థాపన కోసం కృషి చేయడమే ఆయనకు మనమర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిట్ల పురణాలకు వేధిక కాకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా సమగ్ర చర్చ జరగాలని సూచించారు. ప్రభుత్వం విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించి నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్య, వైద్యరంగాల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరారు. అలాగే 22ఏ భూ సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పుట్టా ఆంజనేయులు, నాయకులు బాల్రెడ్డి, ఎండి జబ్బార్, గోపి, మేకల ఆంజనేయులు, రాజు, వెంకట్రాములు, మహబూబ్పాషా, బాల్యానాయక్, పరమేశ్వరాచారి, కాకం అంజన్న తదితరులు పాల్గొన్నారు.


