వనపర్తి: డెంగీ, మలేరియా నివారణకు ప్రతి ఒక్కరూ పరిసరాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక పుర పరిధిలోని 8, 19, 20 వార్డుల్లో నిర్వహించిన డ్రై డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆరోగ్య సిబ్బంది చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న సూచనలపై ఆరా తీశారు. అదేవిధంగా దోమల వృద్ధికి కారణమయ్యే ప్రదేశాలను గుర్తించి చేపడుతున్న యాంటీ లార్వా ఆపరేషన్ను పరిశీలించి అధికారులు, పుర సిబ్బందికి పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని పాటిస్తూ డెంగీ, మలేరియా నివారణలో అధికారులకు సహకరించాలని కోరారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి భాస్కర్నాయక్, పుర కమిషనర్ నిరంజన్, వైద్య, పుర సిబ్బంది, వార్డు ప్రతినిధులు పాల్గొన్నారు.
మొక్కలు నాటి సంరక్షిద్దాం..
ఆత్మకూర్: దోమల నివారణకు చర్యలు చేపడుతున్నామని.. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. శుక్రవారం పుర కేంద్రంలో జరిగిన డ్రై డే కార్యక్రమంలో పాల్గొని పుర చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీను, కమిషనర్ నరేష్కుమార్, 8వ వార్డు కౌన్సిలర్ జిందె జ్యోతితో కలిసి మొక్కలు నాటారు. వర్షాల కారణంగా నివాసాల పరిసరాల్లో వర్షపు నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని డ్రమ్ములు, పాత టైర్లలో నీరు నిల్వకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట మేనేజర్ సీత్యానాయక్, వార్డుల అధికారులు, పుర సిబ్బంది ఉన్నారు.


