ఆత్మకూర్: స్థానిక సీఐ కార్యాయంలో గురువారం తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. సీఐ శివకుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఆత్మకూర్ సర్కిల్ పరిధిలోని మదనాపురం, అమరచింత, ఆత్మకూర్ పోలీస్టేషన్ల పరిధిలో 55 మంది కానిస్టేబుళ్ల ఓట్లు ఉండగా.. 54 ఓట్లు పోలయ్యాయని వివరించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఓటింగ్, సాయంత్రం 4 గంటలకు లెక్కింపు అనంతరం విజేతలను ప్రకటించారు. కానిస్టేబుళ్లు బాలయ్య (ఆత్మకూర్)కు 41, అశోక్ (ఆత్మకూర్)కు 38 ఓట్లతో విజేతలుగా నిలిచారు. ఎస్ఐల విభాగంలో ఆత్మకూర్ ఎస్ఐ జయన్న, మహిళా కానిస్టేబుళ్ల విభాగంలో నాగలక్ష్మి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలను సీఐ పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తకోట రూరల్: కొత్తకోట సర్కిల్ పరిధిలోని ఐదు పోలీస్స్టేషన్లకు చెందిన 100 మంది సిబ్బంది గురువారం జరిగిన పోలీసు సంఘం ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో కురుమయ్యగౌడ్, వెంకటస్వామి, మధు, నరేష్ బరిలో నిలవగా.. ఓట్ల లెక్కింపు అనంతరం కానిస్టేబుళ్లు నరేష్ (పెద్దమందడి), మధు (శ్రీరంగాపురం) విజయం సాధించారు. ఇద్దరు ప్రతినిధులు జిల్లాకేంద్రంలో శుక్రవారం జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొననున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.


