వనపర్తి: జిల్లాలో డెంగీ కేసులు నమోదైన నేపథ్యంలో పారిశుద్ధ్యం నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి జిల్లాలోని ఎంపీడీఓలు, పుర కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఫ్రై డే.. డ్రై డే నిర్వహణ, పారిశుద్ధ్యం, డెంగీ నియంత్రణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీరు నిల్వ ఉండే ప్రదేశాలు గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్లను విస్తృతంగా చేపట్టాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని.. ఇళ్ల పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్న్వాడీ కేంద్రాలు, ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ వ్యాప్తికి కారణమయ్యే దోమల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని.. స్వచ్ఛతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. మున్సిపల్, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమ నిర్వహణ, యాంటీ లార్వా చర్యలు, పారిశుద్ధ్య పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.


