మదనాపురం: వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు నీటి సంరక్షణే శాశ్వత పరిష్కారమని డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. ఆదివారం స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన ఎంసీఎల్ఎఫ్ (మోడల్ క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్) శిక్షణకు ఆమె హాజరై సంఘ సభ్యులకు ‘విజన్ బిల్డింగ్’ అనే అంశంపై అవగాహన కల్పించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం ‘జలసిరి’ కార్యక్రమాన్ని సోమవారం నుంచి గ్రామాల్లో విస్తృతంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు, మహిళా సంఘాల సభ్యులకు నీటి సంరక్షణ ప్రాధాన్యంపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూగర్భ జలమట్టం పెంపునకు ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంట, ప్రతి రైతు పొలంలో ఊట కుంటలు ఏర్పాటు చేసుకునేలా చైతన్యపర్చాలన్నారు. ప్రతి నీటి చుక్కను సంరక్షించడంతో భవిష్యత్లో నీటి కొరతను అధిగమించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఐబీ ఏపీఎం వెంకన్న, ఏపీఎంలు, ఏపీఓలు, సీసీలు, వీఓఏలు, మండల సమాఖ్య సిబ్బంది, కార్యవర్గ సభ్యులు, గ్రామ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


