కొత్తకోట రూరల్: ఎల్నినో నేపథ్యంలో తాగునీటి నిర్వహణ, భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. శనివారం పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, తాగునీటి కొరత ఏర్పడకుండా భూగర్భ జలాలను సంరక్షించడంతో పాటు వర్షపు నీటిని ప్రతి గ్రామంలో సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. రైతులు వరి, చెరకు వంటి అధిక నీరు అవసరమున్న పంటల సాగును తగ్గించి ఆరుతడి పంటలు, ఆయిల్పాం సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ సాగు వైపు మళ్లాలని, వ్యవసాయశాఖ అధికారుల సలహాలు తీసుకొని శాసీ్త్రయ పద్ధతుల్లో సాగు చేపట్టాలన్నారు. జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్ పాల్గొన్నారు.
నిల్వ గోదాములు తనిఖీ
వనపర్తి రూరల్: పెబ్బేరులోని సాయి గోపాల్ రైస్మిల్లుకు కేటాయించిన ధాన్యం ఎర్రవల్లి మండలం బీచుపల్లి సమీపంలో ఉన్న స్టాక్ గోదాంలలో భద్రపర్చారు. శనివారం రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా పూర్తిస్థాయిలో తనిఖీలు కాలేదని సమాచారం.


