కల్వకుర్తి టౌన్: ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజన్ టెక్నీషియన్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోఆర్డినేటర్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ (ఎంపీసీ/ బైపీసీ) ఉత్తీర్ణులైన 18–23 ఏళ్ల మధ్య వయస్సు గల యువత అర్హులని, ఒకేషనల్ ఇంటర్ చదివిన వారికి అవకాశం లేదన్నారు. అచ్చంపేట, లింగాల, కల్వకుర్తి, కొల్లాపూర్, కొత్తకోట, వనపర్తి, తెలకపల్లి, పెద్దకొత్తపల్లి, కోడేరు ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష శుక్రవారం ఉదయం 10 గంటలకు తూడుకుర్తిలోని రామచంద్రారెడ్డి నేత్ర వైద్య కేంద్రంలో ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్ మార్కుల మెమోతోపాటు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 77309 93383, 99634 78751లను సంప్రదించాలని సూచించారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి శిక్షణతోపాటు ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఎల్నినోను సమర్థంగా ఎదుర్కొందాం
వనపర్తి రూరల్: ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి స్థానికల సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సూచించారు. గురువారం పెబ్బేరు మండలం వై–శాఖాపూర్, శ్రీరంగాపురంలోని రైతువేధికలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎల్నినోను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్నిశాఖలు సమన్వయంతో ముందస్తు సన్నద్ధత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి నిర్వహణ, భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి వనరుల సమర్థ వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తూ ముందస్తు చర్యలను గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సునీత, వ్యవసాయ అధికారి హైమావతి, సర్పంచ్లు మద్దిలేటి, నిఖిత, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలు
సాగు చేయాలి
పాన్గల్: ఎల్నినో నేపథ్యంలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని డీఆర్డీఓ ఉమాదేవి, ఏడీఏ తిప్పేస్వామి రైతులకు సూచించారు. గురువారం మండలంలోని శాగాపూర్, శాగాపూర్తండాలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఏడీఏ, మల్లాయిపల్లిలో డీఆర్డీఓ పాల్గొని మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. తక్కువ నీరు అవసరమయ్యే కంది, మినుము, జొన్న వంటి పంటలతో పాటు అంతర పంటలుగా కంది–మినుము, ఆముదం–మినుముతో పాటు టమాటా, బెండకాయ, చిక్కుడు వంటి కూరగాయాల పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వినియోగం, మల్చింగ్, వర్షపు నీటి సంరక్షణ, సూక్ష్మ సాగునీటి పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం ఎల్నినో ప్రభావంపై ముద్రించిన కరపత్రాలను రైతులతో కలిసి అధికారులు విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో అసిస్టెంట్ జల శాస్త్రజ్ఞుడు ఉమేష్, తహసీల్దార్ కార్తీక్రావు, ఎంపీడీఓ గోవిందరావు, ఏఈఓలు, ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
397 క్వింటాళ్ల
వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 397 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.7,269, కనిష్టంగా రూ.3,549, సరాసరిగా రూ.4,279 ధరలు లభించాయి. అలాగే 6 క్వింటాళ్ల వరి (సోన) రాగా క్వింటా రూ.2,585 ధర పలికింది.


