అమరచింత (ఆత్మకూర్): ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు ముందుండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. ఆత్మకూర్లో కొత్తగా చేపడుతున్న లేఅవుట్లను బుధవారం ఆయన పరిశీలించి అనుమతులకు కావాల్సిన పత్రాలను తనిఖీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్లు, మిగిలిన అన్నిరకాల పత్రాలు సక్రమంగా ఉంటేనే అనుమతులిస్తామని చెప్పారు. అనంతరం స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పుతున్న సోలార్ ప్లాంట్ పనులను పరిశీలించారు. పనుల పురోగతి, విద్యుదుత్పత్తి సామర్థ్యం, నిర్వహణ విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సోలార్ ప్లాంట్ను సకాలంలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. పుర, గ్రామపంచాయతీలోని పాత లేఅవుట్లతో పాటు కొత్త లేఅవుట్లలో పురపాలికకు చెందాల్సిన 10 శాతం స్థలాలను స్వాధీనం చేసుకొని అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా స్థలాలు కబ్జాకు గురైనట్లు తెలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పుర కమిషనర్ నరేష్కుమార్కు సూచించారు. అభివృద్ధితో పాటు స్వచ్ఛతకు ప్రాధాన్యమిస్తూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.


