కొత్తకోట రూరల్: ఉపాధ్యాయులు బోధనా విధానాలను మరింత మెరుగుపర్చుకుని జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. పెద్దమందడి మండలం బలిజపల్లి–జంగమాయపల్లి ఉన్నత పాఠశాలలో గణిత, ప్రాథమిక ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న మూడురోజుల వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం రెండోరోజు శిక్షణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత విద్యాసంవత్సరంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమంపై నిర్వహించిన సర్వేలో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానం సాధించడం ఉపాధ్యాయుల అంకితభావం, కృషికి నిదర్శనమన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తే జిల్లా మరింత మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. అనంతరం శిక్షణ తరగతులను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణ, అటల్ టింకరింగ్ ల్యాబ్, బడితోటలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. రెండోతరగతి ఎఫ్ఎల్ఎన్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడంపై ఉపాధ్యాయులను అభినందిస్తూ, ఇదే ఉత్సాహంతో మరింత కృషి చేసి ప్రథమ స్థానం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానిటరింగ్ అధికారి మహానంది, శిక్షణ ఆర్డీఓ రంజిత్రెడ్డి, మండల విద్యాధికారి ఎస్.మంజులత, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.


