వనపర్తిటౌన్: రైతుల సంక్షేమం, అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ధనలక్ష్మి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని.. రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ, రైతుబీమా, రైతు భరోసా అందిస్తూ అండగా నిలుస్తుందన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధిలో రైస్మిల్లర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని.. రైతులు, వ్యాపారులు, వినియోగదారుల మధ్య వారధిగా నిలవాలని కోరారు. రైతులు పండించిన ధాన్యానికి విలువను జోడించి ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడం రైస్మిల్లర్ల గొప్ప సేవ అని కొనియాడారు. జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు రైస్మిల్లర్ల సహకారం ఎంతో అవసరమని, ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ధనలక్ష్మిని అధ్యక్షురాలి కుర్చిలో కూర్చొబెట్టి సన్మానించారు. కార్యక్రమంలో కార్యవర్గసభ్యులు, రైస్మిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


