వనపర్తి: వర్షాకాలంలో దోమల నివారణ, పారిశుద్ధ్య చర్యలను మరింత ముమ్మరం చేసి ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పుర పరిధిలోని 2వ వార్డు కమలానగర్లో పర్యటించి డ్రై డే కార్యక్రమ అమలు తీరును పరిశీలించారు. డ్రై డే సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. స్వచ్ఛత, వీధిదీపాల పనితీరు, వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో శుభ్రత పాటించడం, దోమల నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. అనంతరం గోపాల్పేట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించి నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. రికార్డులను సక్రమంగా నిర్వర్తించడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలో అమలవుతున్న ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమాలు, పారిశుద్ధ్య చర్యలు, దోమల నివారణ కార్యక్రమాలను పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఆయన వెంట పుర కమిషనర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, పుర సిబ్బంది, గ్రామపంచాయతీ అధికారులు ఉన్నారు.


