వనపర్తి: గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని.. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. గ్రామ వనరులను వినియోగించుకొని ఆదాయాన్ని పెంచుకోవాలని, జీపీ యాప్లో ప్రొఫైల్స్ అప్డేట్ చేయాలన్నారు. పారిశుద్ధ్య పనులు యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలని కోరారు. తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలు ఆర్థికంగా బలోపేతం అయితేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. వీబీజీ రాంజీ పథకంలో భాగంగా జాబ్కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి పని కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని కార్యక్రమాలు అమలు జరిగేలా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు చొరవ తీసుకొని ఎన్యూమరేషన్ ఫారాలను పూరించడం, ఆన్లైన్ చేయడం వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీవో రఘునాథ్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్రెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ శ్రావ్య, ఎంపీడీఓలు పాల్గొన్నారు.


