వనపర్తి రూరల్: అంతరాలు లేని సమాజ స్థాపనే కమ్యూనిస్టుల లక్ష్యమని, అందుకు ప్రజలను చైతన్యం చేసి పోరాడాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్హాల్లో సీపీఐ నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యుల మూడు రోజుల శిక్షణ తరగతుల ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలనరసింహ పాల్గొని అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు యుద్ధకాంక్షతో నరమేధాన్ని సృష్టిస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ రామ మందిరంతో పేరుతో అధికారంలోకి వచ్చి, అదే రామ మందిరంలో దొంగలు పడి రూ.కోట్లు కొల్లగొడుతున్నా.. ప్రధాని మోదీ నేటికీ పెదవి ఇప్పకపోవడం సరైందికాదన్నారు.
ఆరు గ్యారెంటీల అమలు అంతంతే..
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో రాజకీయ జోక్యం పెరిగిందని, అర్హులెవరికీ ఇళ్లు కేటాయించిన దాఖలాలు లేవని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా నిరుద్యోగులను దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డి, కేఎల్ఐ, భీమా, జూరాల పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు విజయరాములు, బాలకిషన్, ఆంజనేయులు, రాష్ట్ర సమితి సభ్యుడు కేశవులుగౌడ్, నియోజక వర్గ కార్యదర్శి రమేష్, జిల్లా నాయకులు కళావతమ్మ, నరసింహ, శ్రీరామ్, మోష, గోపాలకృష్ణ, సురేష్, ఇందిర, కృష్ణవేణి, గీత, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.


