19 రోజులు.. రూ.164.18 కోట్లు
● మున్సిపల్ ఎన్నికల్లో భారీగా
మద్యం విక్రయాలు
● అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లోనే..
మహబూబ్నగర్ క్రైం: సాధారణంగా ఎన్నికలు అంటేనే మద్యం, డబ్బు ఏరులై పారాల్సిందే. ప్రధానంగా ప్రచార సమయంలో ఓటర్లు మద్యం మత్తులో ఊగుతుంటారు. అలాంటిది మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు అంటే భారీగా లిక్కర్ పంపకాలు చేయడం సర్వసాధారణం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో నిలబడిన ప్రతి అభ్యర్థి ఆయా వార్డులు, డివిజన్లలో ఉన్న ప్రతి ఓటరుకు మద్యం సీసాలు అధిక మొత్తంలో పంపిణీ చేయడం జరిగింది. ఒక్కో వార్డు లేదా డివిజన్లో ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులతోపాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి 8 మంది వరకు బరిలో ఉన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఒకరిని చూసి మరొకరు పోటీపడి విచ్చలవిడిగా ఓటర్లకు మద్యం పంపిణీ చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలో మద్యం అధికంగా పంపిణీ కావడం విశేషం. చిన్న మున్సిపాలిటీల్లో సాధారణ మద్యం ఇవ్వగా.. కార్పొరేషన్, కొద్దిగా పెద్ద మున్సిపాలిటీల్లో బ్రాండెండ్ లిక్కర్ ఓటర్లకు అందించారు. ప్రధానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో ప్రతి డివిజన్లో కేవలం మద్యం కోసమే రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసిన సందర్భం కన్పించింది. ఫిబ్రవరి 1 నుంచి గురువారం వరకు ఉమ్మడి జిల్లాలోని 227 మద్యం దుకాణాల పరిధిలో రూ.168.18 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో అధిక మొత్తం ఈ నెల 4 నుంచి 9 తేదీల మధ్య జరగడం విశేషం. మద్యం అమ్మకాల్లో ప్రధానంగా మహబూబ్నగర్ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలు ఉన్నాయి.
లిక్కరే అధికం
ఎన్నికల్లో అభ్యర్థులు అధిక మొత్తంలో లిక్కర్ కాటన్లు కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. అయితే ఓటర్లకు దాదాపు 99 శాతం లిక్కర్ బాటిల్స్ అందించగా చాలా తక్కువగా బీరు బాటిల్స్ ఇచ్చిన ఘటనలు కనిపించాయి. సాధారణ ఓటర్లకు ఇంటింటికి తిరిగి లిక్కర్ బాటిల్స్ మాత్రమే పంపిణీ చేశారు.
19 రోజులు.. రూ.164.18 కోట్లు


