కేసుల ఛేదనలో శునకాల పాత్ర కీలకం
● జిల్లా పోలీసుశాఖలో ‘మాయ’ చేరిక
● ఎస్పీ సునీతరెడ్డి
వనపర్తి: దొంగతనాలు, హత్య కేసుల విచారణలో కీలక ఆధారాలను సేకరించే ట్రాకర్ శునకం ‘మాయ’ జిల్లా పోలీసుశాఖలో చేరినట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. 8 నెలల ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న డాగ్ హాండ్లర్ కానిస్టేబుల్ దేవ్యానాయక్ గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సమీపంలోని పోలీస్ డాగ్ ట్రైనింగ్ సెంటర్, ఐఐటీఏ మోయినాబాద్లో శిక్షణ పొందిన ‘మాయ’ శునకం ప్రదర్శన, పనితీరు తదితర అంశాలను ఎస్పీకి వివరించారు. అనుమానాస్పద వస్తువుల గుర్తింపు, నేరస్తుల అడుగుజాడలు పసిగట్టడం, విధి నిర్వహణలో విశేష ప్రావీణ్యం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో జరిగే దొంగతనాలు, హత్య కేసుల ఛేదనలో మాయ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. నేరాన్ని కేవలం విచారణతోనే కాదు.. ఆధారాలతోనే ఛేదించాలని, ఆ ఆధారాలను పసిగట్టే నిశ్శబ్ధ యోధులే ఈ శునకం అని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల నిఘా వ్యవస్థతో పాటు శునక దళం సేవలను వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే పోలీసుశాఖ ప్రధాన బాధ్యతని.. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్ సీఐ అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


