
పట్టాలెక్కిన ఆనందం
పీయూలో కనులపండువగా స్నాతకోత్సవం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవ కార్యక్రమం గురువారం కనులపండువగా జరిగింది. ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాగా.. పీయూ లైబ్రరీ ఆడిటోరియం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆడిటోరియం హాల్లో ఈసీ మెంబర్స్ సమావేశంలో పాల్గొని.. స్నాతకోత్సవం జరిగే లైబ్రరీ ఆడిటోరియంలోకి వచ్చారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన మన్నె సత్యనారాయణరెడ్డికి వీసీ శ్రీనివాస్ యూనివర్సిటీ చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతితో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఆ తర్వాత గోల్డ్మెడల్స్ స్వీకరిస్తున్న విద్యార్థులు, పీహెచ్డీ అవార్డులు అందుకోనున్న విద్యార్థులతో ప్రమాణం చేయించారు. ముందుగా పీహెచ్డీ పూర్తిచేసిన 12 మందికి అవార్డులు, డాక్టరేట్, తర్వాత యూజీ, పీజీలో టాపర్లుగా నిలిచిన వారికి గోల్డ్మెడల్స్ అందించారు.
వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీ ఒక సాధారణ పీజీ కళాశాలగా ప్రారంభమై 2008లో పూర్తిస్థాయిలో యూనివర్సిటీగా అవతరించి ప్రతి సంవత్సరం మరింత అభివృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నారు. 171 ఎకరాల్లో ఉన్న యూనివర్సిటీలో మహబూబ్నగర్లోని యూనివర్సిటీలో 5 కళాశాలలు ఉండగా గద్వాల, కొల్లాపూర్, వనపర్తిలో పీజీ సెంటర్లు కొనసాగుతున్నాయన్నారు. ప్రారంభంలో కేవలం 5 కోర్సులతో ప్రారంభమైన యూనిర్సిటీ ఇప్పుడు 24 కోర్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. కొత్తగా ఇంజినీరింగ్, లా కళాశాలలు ప్రారంభించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎఫ్సెట్ ద్వారా లా లో మొత్తం 100 శాతం (ఎల్ఎల్బీలో 60, ఎల్ఎల్ఎంలో 20) సీట్లు భర్తీ చేశామన్నారు. రీసెర్చ్లో 9 సబ్జెక్టులు ఉండగా.. 12 మందికి డాక్టరేట్ పట్టాలు అందిస్తున్నామని, మరో 25 మంది రీసెర్చ్లో ఉన్నారన్నారు. యూజీ, పీజీ స్థాయిలో సీబీసీఎస్ (చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం) అమలు పరుస్తున్నామని, ఇప్పటి వరకు 50 సెమినార్లు, 7 రోజులు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మూక్స్, స్వయం పోర్టల్స్లో ఇప్పటికే 2 వేలకుపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు.
పీయూలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తున్నామని, హాస్టళ్లు, లైబ్రరీ, స్పోర్ట్స్, ల్యాబ్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయని వీసీ అన్నారు. నూతనంగా రూ.13.2 కోట్లతో రీసెర్చి ఫెసిలిటీ భవనం నిర్మాణం జరుగుతుందని, రూ.35 కోట్లతో ఇంజినీరింగ్ కళాశాల, రూ.15 కోట్లతో లా కళాశాల నిర్మాణానికి అనుమతులు వచ్చాయన్నారు. ఇటీవల కొత్త బాలికల హాస్టల్ ప్రారంభించామని, ఇందులో 300 మంది విద్యార్థులకు వసతులు కల్పిస్తున్నామన్నారు. రూ.5 కోట్లతో సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నామన్నారు. పీఎం ఉషా స్కీం ద్వారా రూ.100 కోట్ల నిధులు వచ్చాయని, ఎన్ఈపీలో భాగంగా సమర్థ్ పోర్టల్ను ఉపయోస్తూ అడ్మినిస్ట్రేషన్ పరమైన మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. పీయూలో 70 శాతం ఈకో ఫ్రెండ్లీ వాతావరణం, గ్రీనరీ ఉండటం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు సమాజానికి టార్చ్బేరర్గా నిలవాలని, సమాజాన్ని, దేశాన్ని మార్చేందుకు తమవంతు కృషి చేయాలన్నారు. స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదానోత్సవం మాత్రమే కాదని.. అది విద్యార్థి కృషి, ఉపాధ్యాయుల సేవ, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే సందర్భం అన్నారు. విద్య యొక్క అసలు లక్ష్యం ఉద్యోగం పొందడమే కాదని.. అది వ్యక్తిత్వం, విలువలు, జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం అన్నారు. పీయూలో చాలా అభివృద్ధి జరిగిందని, ఇక్కడ చేస్తున్న అనేక కార్యక్రమాలు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా మిలియన్ ట్రీ ప్లాంటేషన్, యూనివర్సిటీ విద్యార్థులు గ్రామాలను దత్తత తీసుకోవడం, కనెక్ట్ విత్ చాన్స్లర్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నా
యన్నారు. తెలంగాణలో ఏ యూనివర్సిటీ సాధించలేని విధంగా పీయూ పీఎం ఉషా స్కీం ద్వారా రూ.100 కోట్లు సాధించడం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. యూనివర్సిటీ ఈ సంవత్సరం న్యాక్ రెండోసారి వెళ్లడం మంచి పరిణామం అని, ఉన్నత విద్యకు కృషి చేసే యూనివర్సిటీలు ఆధునిక దేవాలయాలుగా నిలుస్తున్నాయన్నారు. ఇలాంటి యూనివర్సిటీలు రీసెర్చి, ఇంక్యూబేషన్ సెంటర్లుగా మారి విద్యార్థుల ద్వారా కొత్త స్టార్టప్లు ఏర్పాటు కోసం కృషి చేయాలన్నారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
పీయూలో ఇటీవల లా, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడం శుభపరిణామం అని గవర్నర్ అన్నారు. ఇంజినీరింగ్లో డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషన్ లర్నింగ్ వంటి ఆధునిక కోర్సులు ప్రారంభించిన మొదటి సంవత్సరంలో 100 శాతం అడ్మిషన్లు సాధించడం అభినందిచదగ్గ విషయమన్నారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సబ్జెక్టులతో ఇక్కడి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020తో విద్యార్థులకు చదువుతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేందుకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. స్నాతకోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు అభినందించారు.
ఈ నేలలో పుటిన బిడ్డగా పాలమూరు యూనివర్సిటీ వేదికపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఎంఎస్ఎన్రెడ్డి అన్నారు. ఒకప్పుడు వలసల జిల్లాగా ఉన్న పాలమూరు ఇప్పుడు విద్య, ఆరోగ్యం, పరిశ్రమ రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తుందన్నారు. విద్యార్థుల విజయం కేవలం వ్యక్తిగత పురోగతితో కాదని, సమాజానికి తిరిగి ఇచ్చే సేవతో కొలవాలని పేర్కొన్నారు. పీయూ బ్రాండ్ అంబాసిడర్, నిజాయితీ, కరుణ, ధైర్యం వారి యొక్క లక్ష్యంగా మారాలన్నారు. విద్యార్థుల సాంకేతికత పరిశోధనలను, ఆవిష్కరణలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని, సేవా దృక్పథంతో పనిచేసి దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
స్నాతకోత్సవం పూర్తయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పీయూలో ఆడిటోరియం నిర్మాణానికి రూ.12 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
మన్నె సత్యనారాయణరెడ్డికి
గౌరవ డాక్టరేట్ ప్రదానం
మరో 83 మందికి గోల్డ్ మెడల్స్,
12 మందికి పీహెచ్డీల బహూకరణ
పీయూ మరింత అభివృద్ధి చెంది,
నాణ్యమైన విద్య అందించాలి:
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఆడిటోరియం నిర్మాణానికి
రూ.12 కోట్లు ప్రకటించిన ఎంఎస్ఎన్ రెడ్డి

పట్టాలెక్కిన ఆనందం