ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడీకి జిల్లా కేంద్రంలో పోస్టింగ్
విస్తుపోతున్న వ్యవసాయ శాఖ సిబ్బంది
వ్యవసాయ శాఖ మంత్రి
అచ్చెన్నాయుడు శాఖలో నిర్వాకం
ఏడీఏగా నియమించారు..
విజయనగరం ఫోర్ట్:
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నోరెత్తితే చాలు నీతి, నిజాయితీ గురించి వల్లె వేస్తారు. సత్యహరిశ్చంద్రునికి అన్నదమ్ముడి మాదిరి వ్యవసాయ శాఖను పారదర్శకంగా నడిపిస్తున్నట్టు కలరింగ్ ఇస్తారు. గురవింద గింజ తన కింద మచ్చను చూడని విధంగా వ్యవసాయ శాఖలో అనేక అక్రమాలు జరుగుతు న్నా పట్టించుకోకుండా వాటిని కప్పిపుచ్చే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లా వ్యవసాయ శాఖలో జరుగుతు న్న తంతు వ్యవసాయ శాఖ సిబ్బందితో పాటు రైతులను విస్తుగొల్పుతుంది. గజపతినగరం ఏడీఏగా పని చేసిన నిర్మలాజ్యోతి, ఆమె భర్తతో కలిసి నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయాన్ని ప్రోత్సహించారని వ్యవసాయ శాఖ సిబ్బందే వ్యవసాయ శాఖ కమిషనర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నకిలీ పురుగు మందులు, ఎరువులు విక్రయించాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని వ్యవసాయ సిబ్బంది ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆ శాఖ కమిషనర్ విచార ణకు ఆదేశించారు. కమిషనర్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఏడీఏ సెలవు పెట్టేశారు. విచార ణ నుంచి తప్పించుకునేందుకు సెలవు పెట్టేశార నే ఆరోపణలు ఉన్నాయి. ఆమె సెలవు పెట్టడంతో విజయనగరం భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ గా పనిచేస్తున్న గాలి శ్రీనివాస్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే మూడు రోజులు క్రితం భూసార పరీక్షా కేంద్రం ఏడీఏగా నిర్మలా జ్యోతి బాధ్యతలు స్వీకరించారు. దీంతో వ్యవసా య శాఖలో పనిచేసే సిబ్బంది, సహచర అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నకిలీ పురుగు మందులు, ఎరువులు విక్రయానికి సహకరించారనే సంచలన ఆరోపణలు వచ్చిన ఏడీఏకు జిల్లా కేంద్రంలో అది కూడా విచారణ పూర్తి కాకుండానే పోస్టింగ్ ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు చెలరే గుతున్నాయి. సాధారణంగా అంత పెద్ద ఆరోపణలు వచ్చినప్పుడు దూర ప్రాంతాలకు బదిలీ చేయడమో.. లేదా సరెండర్ చేయడమో చేస్తారు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాఖలో అక్రమార్కులకు అందలం ఎక్కించే విధంగా వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గజపతినగరం ఏడీఏ నిర్మలాజ్యోతికి విజయనగరం భూసార పరీక్ష కేంద్రం ఏడీఏగా వ్యవసాయ శాఖ కమిషనర్ నియమించారు. ఆమె బాధ్యతలు కూడా స్వీకరించారు.
– వి.టి.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి


