● రాష్ట్ర జనగణన శాఖాధికారి సాయిశేఖర్
నెల్లిమర్ల రూరల్: ఇంటింటా చేపడుతున్న జనగణనలో ప్రతి ఇంటి వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలని రాష్ట్ర జనగణన శాఖ(డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్) సంయుక్త సంచాలకులు బీవీఎల్ సాయిశేఖర్ సూచించారు. మండలంలోని కొత్తపేటలో తహసీల్దార్ శ్రీకాంత్తో కలిసి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సిబ్బంది నిర్వహిస్తున్న వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఇళ్ల సంఖ్య, కుటుంబ సభ్యుల వివరాలు, నివాస పరిస్థితులు, ఇతర ప్రాధమిక సమాచారం నమోదు చేసే విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న జనగణనను ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. వివరాల నమోదులో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమాచారం తప్పిదం కాకుండా చూసుకోవాలన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికలకు జనగణన కీలకమని, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


