విజయనగరం టౌన్: పట్టణ శివారు పూల్బాగ్ కాలనీలో వెలిసిన మరిడిమాంబ అమ్మవారి చల్లదనం మహోత్సవం ఈ నెల 17న ఆదివారం వైభవంగా నిర్వహించనున్నట్టు కమిటీ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఆలయం ఆవరణలో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. సుమారు మూడు శతాబ్దాల నుంచి మరిడిమాంబ అమ్మవారు భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోందని ప్రాజెక్టు చైర్మన్ సముద్రాల నాగరాజు పేర్కొన్నారు. నగరంలో ఎక్కడ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించినా, ముందుగా ఆలయానికి వచ్చి పసుపు, కుంకుమలు సమర్పించడం ఇక్కడ విశిష్ట సంప్రదాయమని అర్చకులు కన్నబాబు తెలిపారు. మహోత్సవం రోజు ఉదయం నుంచే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, శాస్త్రోక్తంగా నిర్వహించనున్నామన్నారు. ఆలయ ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్దాంతి పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉపాధ్యక్షుడు బెహరా కూర్మారావు వివరించారు. సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బేతా కృష్ణారావు, సభ్యులు దువ్వు శ్రీనివాసరావు, అచ్చిరెడ్డి, చిలకలపూడి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.


