బొబ్బిలి రూరల్: గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం న్యాయ వ్యవస్థ అండగా ఉంటుందని జిల్లా కుటుంబ న్యాయస్థానం జడ్జి బి. అప్పలస్వామి అన్నారు. మండలంలోని ఎరంకందొరవలస గిరిజన గ్రామంలో మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించారు. గిరిజనుల భూములను కాపాడుకునేందుకు, వారి జీవనోపాధిని రక్షించేందుకు రాజ్యాంగంలో ప్రత్యేక చట్టాలు కల్పించబడ్డాయన్నారు. 18 ఏళ్ల లోపు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రతి చిన్న విషయానికీ కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్అదాలత్లో రాజీ చేసుకోవాలని సూచించారు. సీఐ నారాయణరావు మాట్లాడుతూ.. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగించినా, విక్రయించినా చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఎ. రాధాకృష్ణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణప్రసాద్, ప్యానల్ న్యాయవాదులు ఆర్వీ ప్రసాద్, సీహెచ్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.


