విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

May 16 2026 4:59 AM | Updated on May 16 2026 4:59 AM

మక్కువ: మండలంలోని పనసభద్ర పంచాయతీ ఎర్ర సామంత వలసలో శుక్రవారం విద్యుత్‌ షాక్‌ కొట్టి ఓ యువకుడు మృతిచెందాడు. వేసవిలో ఈదురుగాలుల దృష్ట్యా విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఎర్రసామంత వలస 11 కేవీ లైన్‌పై పిచ్చి మొక్కలను తొలగించడానికి విద్యుత్‌ శాఖ సిబ్బంది శుక్రవారం పనులను ప్రారంభించారు. విద్యుత్‌ శాఖ సిబ్బంది గ్రామానికి చెందిన కొంత మందితో పిచ్చిమొక్కల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. 11 కేవీ విద్యుత్‌ లైన్‌ పై ట్రీ కటింగ్‌ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన పీడిక నవీన్‌ (20) విద్యుత్‌ షాక్‌కి గురై అక్కడకక్కడే మృతిచెందాడు. కొమ్మల కత్తిరింపులో భాగంగా ఆయిల్‌ పామ్‌ తోటల్లో పొడవాటి కొమ్మలను కత్తిరించేందుకు ఉపయోగించిన కత్తి, అదుపుతప్పి సమీపంలో ఉన్న 33 కేవీ విద్యుత్‌ లైన్‌పై పడడంతో యువకుడు చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. 11 కేవీ విద్యుత్‌ లైన్‌ పై ట్రీ కటింగ్‌ చేసేటప్పుడు సమీపంలో గల 33 కేవీ లైన్‌ విద్యుత్‌ సరఫరాను నిలిపివేయకపోవడమే యువకుడి మృతికి కారణమని స్పష్టంగా తెలుస్తోంది. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం కారణంగా తమ కుమారుడు మృతి చెందాడని విద్యుత్‌ శాఖ అధికారులు బాధ్యత వహించాలని బంధువులు కోరుతున్నారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు, తండ్రి, సోదరి, సోదరుడు ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి

సాలూరు: విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం వల్లనే గిరిజన యువకుడు మృతి చెందాడని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.గంగునాయుడు ఆరోపించారు. మక్కువ మండలం ఎర్రసామంతవలసలో విద్యుత్‌లైన్లు తగిలి విద్యుత్‌శాఖలో అవుట్‌సోర్సింగ్‌గా పనిచేస్తున్న పీడిక ప్రకాష్‌ అలియాస్‌ నవీన్‌(23) మృతిచెందాడని తెలిసి పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి వచ్చి బాధిత కుటుంబాన్ని సీపీఎం బృందం పరామర్శించింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, సదరు యువకుడి మృతికి విద్యుత్‌ శాఖ అధికారులు అధికారులు బాధ్యులని కావున విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చట్టపరమైన చ ర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతుడైన ప్రకాష్‌పై ఆధారపడి ఆయన తండ్రి చిన్నప్ప, తల్లి సంబరమ్మ, అక్క, తమ్ముడు చిన్నారి,గణేష్‌లు జీవిస్తున్నారని అన్నారు. విద్యుత్‌ పనుల నిమిత్తం వెళ్లిన ప్రకాష్‌ విగతజీవిగా మారాడని, కావున ఆ కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎన్‌వైనాయుడు, ఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement