నెల్లిమర్ల: రక్తదానం..ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని సాధన యువజన సంఘం అధ్యక్షుడు పాలుబోతు దుర్గాప్రసాదరావు అన్నారు. మండలంలోని జరజాపుపేటలో దివంగత తాడుతూరి సన్యాసినాయుడు జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం ఆదివారం నిర్వహించారు. 22 మంది శిబిరంలో రక్తదానం చేశారు. అనంతరం రక్తదాతలను అభినందించి, సత్కరించారు. రక్తదానం చేస్తే సన్నబడిపోతామన్న అపోహ అందరిలో ఉందని, నిజానికి రక్తం దానం చేస్తే సన్నబడిపోరని ఆరోగ్యవంతులైన వారు ప్రతి మూడు నెలలకోసారి రక్తం దానం చేయవచ్చన్నారు. మనం ఇచ్చే రక్తం ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడడమే కాకుండా వారిపై ఆధారపడి జీవిస్తున్న వారికి గొప్ప మేలు చేసిన వారమవుతామన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఒక్క రక్తదాత ఇచ్చిన రక్తంతో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. రక్తం దానం చేస్తే మళ్లీ మన శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందన్న విషయం తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో గణేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


