విజయనగరం అర్బన్: జిల్లా సమగ్ర శిక్షలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక అమర్ భవన్లో శనివారం జరిగిన కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. సమగ్ర శిక్ష కార్యాలయానికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇటీవల సమగ్ర శిక్ష ప్రాజెక్టు కో ఆర్టినేటర్ను కలెక్టర్ సరెండర్ చేసిన నేపథ్యంలో జరిగిన వ్యవహారానికి సంబంధించిన అధికారులు, సిబ్బందిని గుర్తించేందుకు విచారణ అవసరమని పేర్కొన్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన నిధుల వినియోగంపై సమగ్ర ఆడిట్ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్, వి.గోవిందరావు, ఎన్ని అప్పలనాయుడు పాల్గొన్నారు.
ఎస్టీయూ జిల్లా కమిటీ


