రాజకీయతంతు!
వితంతు పింఛన్లకు..
● గంట్యాడ మండలం వసాది గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి లక్ష్మీనారాయణకు వృద్ధాప్య పింఛన్ వచ్చేది. ఏడాది కిందట ఆయన మరణించారు. భార్య ఎర్రయ్యమ్మ స్పౌజ్ కోటా కింద వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసింది. పింఛన్ ఐడీ కూడా మరుసటి నెలలో వచ్చింది. పింఛన్ వస్తుందని సచివాలయం సిబ్బంది చెప్పారు. పింఛన్ ఇచ్చేసమయంలో సిబ్బందిని సంప్రదిస్తే లాగిన్లోకి పేరు రాలేదని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పలు మార్లు డీఆర్డీఏ, ఎంపీడీఓలను కలిసినా పింఛన్ మాత్రం మంజూరు కాలేదు. –––– ––––––––––––––––––––––––––––––––––––––
● గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన సారిక పోలయ్య అనే వృద్ధుడు గతేడాది ఏప్రిల్ నెలలో మరణించాడు. అతనికి వృద్ధాప్య పింఛన్ వచ్చేది. దీంతో అతని భార్య కళావతి స్పౌజ్కోటా కింద వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసింది. ఆమెకు కూడా పింఛన్ మంజూరైందని సచివాలయం సిబ్బంది చెప్పారు. పింఛన్ ఐడీ కూడా వచ్చింది. పింఛన్ డబ్బుల కోసం సచివాలయ సిబ్బందిని వాకబు చేస్తే లాగిన్లోకి పేరు రాలేదని చెప్పారు. ఆమె పలు సార్లు ఈ అంశంపై పీజీఆర్ఎస్( ప్రజాసమస్యల పరిష్కార వేదిక)లో ఫిర్యాదుచేశారు. డీఆర్డీఏ అధికారులు, ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా పింఛన్ మాత్రం మంజూరుకాలేదు.
విజయనగరం ఫోర్ట్:
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల వారికీ కష్టాలు తప్పడంలేదు. రైతులకు సకాంలో సాగుసాయం అందడం లేదు. ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులకు గుదిబండగా మారాయి. నిరుద్యోగ భృతి అందని ద్రాక్షగా మారింది. డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ రాయితీ ఎండమావిగా కనిపిస్తోంది. ఆడబిడ్డ నిధిని, 50 ఏళ్లకే పింఛన్ హామీని అటకెక్కించారు. పింఛన్తో జీవించే వృద్ధులు, వితంతవులను సైతం చంద్రబాబు సర్కారు ఏడిపిస్తోంది. పింఛన్ అందుకుంటున్న ఇంటి పెద్దదిక్కుకోల్పోయిన వితంతువులకు సైతం పింఛన్ మంజూరు చేయలేని చంద్రబాబు పాలన చూసి సభ్యసమాజం తలదించుకుంటోంది. అర్హత ఉన్నప్పటికీ స్పౌజ్ కోటా కింద వితంతు పింఛన్లు రాని వారు విజయనగరం జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదు. స్పౌజ్ కోటా పింఛన్ల మంజూరులోనూ రాజకీయ వివక్ష చూపుతుండడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
● పీజీఆర్ఎస్లో 37 ఫిర్యాదులు
ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో జిల్లాలో స్పౌజ్ కోటా పింఛన్లు రాలేదని వితంతువులు ఫిర్యాదు చేశారు. అయితే, ఇవి వెలుగులోకి వచ్చినవి. ఇంకా అనేక మందికి స్పౌజ్ కోటా పింఛన్లు మంజూరు కాలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫిర్యాదులు అందాయి
స్పౌజ్ కోటాలో వితంతు పింఛన్లు రాలేదని పీజీఆర్ఎస్లో 37 మంది ఫిర్యాదుచేశారు. వారి వివరాలను సెర్ప్కు ఇప్పటికే పలు మార్లు పంపించాం. టెక్నికల్ సమస్య వల్ల రాలేదని సెర్ప్ అధికారులు చెబుతున్నారు.
– శ్రీనివాసపాణి, డీఆర్డీఏ పీడీ
మంత్రివర్యా.. తగునా మీకిది...
అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వృద్ధాప్య పింఛన్ వచ్చిన వ్యక్తి చనిపోతే అతని భార్యకు స్పౌజ్ కోటాలో వితంతు పింఛను మంజూరు చేస్తున్నట్టు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అధికార టీడీపీ చెందిన వారు అయితేనే స్పౌజ్ పింఛన్లు మంజూరు చేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని గ్రామాల్లోని టీడీపీ కార్యకర్తలు.. పార్టీ కండువ కప్పుకుంటేనే పింఛన్ వస్తుందని, లేదంటే మంజూరు కాదని తేల్చిచెబతుండడం వితంతువులను ఆవేదనకు గురిచేస్తోంది. ప్రస్తుతం రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పింఛన్ మంజూరు కావడంలేదని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయాలకతీతంగా, అర్హతే కొలమానంగా ప్రతీ అరునెలలకోసారి పింఛన్లు మంజూరయ్యేవని గుర్తుచేసుకుంటున్నారు. స్పౌజ్ కోటాలో వితంతువులకు ఎందుకు పింఛన్లు మంజూరు కావడం లేదని డీఆర్డీఏ అధికారులను ప్రశ్నిస్తే సాంకేతిక సమస్య అంటూ తప్పించుకుంటున్నారు. ఎంతటి సాంకేతిక సమస్య అయినా 10 రోజులు, నెలరోజుల్లో పరిష్కారం అవుతుంది. కానీ నెలల తరబడి ఉండదు. సాంకేతిక సమస్యను బూచిగా అధికారులు చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పింఛన్ల మంజూరుకు పచ్చకండువా మెలిక
టీడీపీ కండువా కప్పుకున్నవారికే
స్పౌజ్ కోటా పింఛన్!
పింఛన్ల కోసం పీజీఆర్ఎస్స్లో
37 మంది వితంతు మహిళల ఫిర్యాదు
వెలుగులోకి రానివి అనేకం
రాజకీయతంతు!
రాజకీయతంతు!


