క్రీడా పాఠశాల పిలుస్తోంది.. | - | Sakshi
Sakshi News home page

క్రీడా పాఠశాల పిలుస్తోంది..

Jun 15 2025 7:13 AM | Updated on Jun 15 2025 7:13 AM

క్రీడ

క్రీడా పాఠశాల పిలుస్తోంది..

ఈ నెల 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం

వచ్చే నెల 1 నుంచి 3 రోజుల పాటు జిల్లా స్థాయిలో ఎంపికలు

జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర స్థాయి

ఎంపికలకు అర్హత

విజయనగరం: పిల్లలను కేవలం చదువుకే పరిమితం చేయకుండా వారికిష్టమైన రంగాల్లో ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఆటల్లో రాణిస్తే వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎంతోమంది తెలుగువారు క్రీడలతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. చిన్నప్పటి నుంచి పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో మెరికలుగా తీర్చదిద్దడానికి కడపలో క్రీడా పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతోమంది ఆటల్లో రాణించి, ఉన్నత స్థాయికి వెళ్లారు. ఈ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి (2025–26) 4, 5 తరగతుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రీడా పాఠశాలలో ప్రవేశాలు పొందిన వారికి మంచి భవిష్యత్తు లభించనుంది.

19వ తేదీ వరకు గడువు

క్రీడా పాఠశాలలో నాలుగో తరగతిలో 40 సీట్లు, ఐదో తరగతిలో 40 సీట్లకు సంబంధించి ఈ ఏడాది ప్రవేశాలను చేపట్టనున్నారు. ఒక్కో తరగతిలో 20 మంది బాలురు 20 బాలికలను తీసుకుంటారు. గతంలో మూడు దశల్లో (మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి) ఎంపికలను చేపట్టేవారు. ఈ ఏడాది నుంచి రెండు దశల్లో (జిల్లా, రాష్ట్ర స్థాయి) మాత్రమే ఎంపికలు నిర్వహిస్తారు. నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం 01–04–2015 నుంచి 31–03–2017 మధ్య జన్మించిన వారు, ఐదో తరగతిలో ప్రవేశాలకు 01–04–2014 నుంచి 31–03–2016 మధ్య పుట్టిన వారు అర్హులు. ఈ నెల 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం క్రీడా శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఎంపికలు ఇలా..!

జిల్లా స్థాయి ఎంపికలను ఈ ఏడాది జులై 1 నుంచి 3వ తేదీ వరకు విజయనగరంలోని రాజీవ్‌ స్టేడియంలో చేపట్టనున్నారు. 30 మీటర్ల ఫ్లయింగ్‌ స్టార్ట్‌, స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్‌, మెడిసిన్‌ బాల్‌, షటిల్‌రన్‌, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్‌, 600 మీటర్ల పరుగు లాంటివి నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తారు. అనంతరం రాష్ట్ర స్థాయి శారీరక సామర్థ్య ఎంపికలను ఈ ఏడాది జులై 10, 11 తేదీల్లో నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనబరచిన వారు క్రీడా పాఠశాల ప్రవేశం పొందేందుకు అర్హులుగా నిలుస్తారు. జులై 24 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

క్రీడాకారులకు చక్కని వేదిక

భావి భారత క్రీడాకారులుగా ఎదగాలంటే.. క్రీడా స్ఫూర్తి ఉండి భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలనుకునే వారికి క్రీడా పాఠశాల చక్కటి వేదిక. కార్పొరేట్‌ కంటే దీటుగా విద్యతో పాటు అనుభవజ్ఞులైన శిక్షకులతో శిక్షణ ఇస్తారు. ప్రవేశం దొరికితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఉంటాయి. చదువు, క్రీడా శిక్షణ ఉచితమే. ఎంపిక పోటీలకు సంబంధించి కొన్ని మార్పులు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల వస్తే తెలియపరుస్తాం.

– ఎస్‌.వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి, విజయనగరం

క్రీడా పాఠశాల పిలుస్తోంది..1
1/1

క్రీడా పాఠశాల పిలుస్తోంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement