
పిడుగు పాటుకు ఫీల్డ్ అసిస్టెంట్ దుర్మరణం
● హుస్సేనుపురంలో విషాదం
వీరఘట్టం: ఉపాధి చెరువు పనుల వద్ద మొబైల్ హాజరు వేసుకునేందుకు వెళ్లిన ఫీల్డ్ అసిస్టెంట్ పిడుగు పాటుకు గురై శనివారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని హుస్సేనుపురం గ్రామ శివారులో చెరువు పనులు జరుగుతున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ ఖండాపు శ్రీనివాసరావు ఉదయం 9 గంటలకు పనుల వద్దకు వెళ్లి హాజరు వేసుకున్నాడు. సాయంత్రం 4 గంటలకు మళ్లీ హాజరు వేసుకునేందుకు చెరువు వద్దకు బయలుదేరాడు. అప్పటికే వర్షం పడుతుండడంతో వేతనదారులంతా వెనుదిరిగారు. గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద మొబైల్ యాప్లో అటెండెన్స్ వేసేందుకు శ్రీనివాసరావు మొబైల్ ఆన్ చేసే సరికి సమీపంలో పిడుగు పడడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని వేతనదారులు తెలిపారు. దూరంగా ఉన్న వేతనదారులు పరుగున వెళ్లి సపర్యలు చేశారు. వెంటనే వీరఘట్టంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాసరావు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదం అలుముకొంది. తల్లిదండ్రులు జట్లమ్మ, వెంకటనాయుడు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ జి.కళాధర్ తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలి మృతి
రాజాం సిటీ: మండల పరిధి బొద్దాం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన గుర్తు తెలియని మృతదేహం ఉండడాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ వై.రవికిరణ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమైన విషయం సామాజిక మాధ్యమాల్లో పొందుపరిచామన్నారు. దీంతో బొబ్బిలి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన తిమనాన కాంతమ్మ (55)గా బంధువులు గుర్తించారని తెలిపారు. మృతురాలు గత 25 సంవత్సరాలుగా మతిస్థిమితం కోల్పోయి ఎప్పటికప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం, అందే సమాచారం మేరకు మళ్లీ ఇంటికి తీసుకువెళ్లడం జరుగుతుందని బంధువులు తెలిపారని చెప్పారు. ఈ క్రమంలోనే రాజాం మండలం బొద్దాం వైపు వచ్చి ఈ నెల 13 అర్థరాత్రి సమయం నుంచి తెల్లవారు సమయంలో ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెంది ఉంటుందని తెలిపారు. ఈ మేరకు మృతురాలి బంధువు వజ్జి వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి..
బొండపల్లి: మండలంలోని గరుడుబిల్లి – గజపతినగరం రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని రైలు ఢీకొనిగాని, రైలు నుంచి జారిపడిగాని గుర్తు తెలియని వ్యక్తి శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో మృతి చెందినట్టు బొబ్బిలి రైల్వే హెచ్సీ బి.ఈశ్వర్రావు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉంటుందని, మృతుని శరీరంపై ఎర్ర రంగు షర్టుతో పాటు నలుపు రంగు ప్యాంటును ధరించి ఉన్నట్టు తెలిపారు. మృతుని జేబులో కేసింగ నుంచి చెన్నె సెంట్రల్కు వెళ్తున్నట్టు టిక్కెట్టు ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. మృతదేహాన్ని విజయనగరంలోని మహరాజ కేంద్ర సర్వజన ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు.

పిడుగు పాటుకు ఫీల్డ్ అసిస్టెంట్ దుర్మరణం

పిడుగు పాటుకు ఫీల్డ్ అసిస్టెంట్ దుర్మరణం