
బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన వరాలేమయ్యాయి..!
బొబ్బిలి: గత ఎన్నికల్లో టీడీపీ కూటమి బీసీ డిక్లరేషన్ ప్రకటించి అందులో విశ్వబ్రాహ్మణులకు ప్రకటించిన వరాల ఊసేలేదని విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు అన్నారు. జిల్లా అధ్యక్షుడు ముగడ వెంకటరమణ అధ్యక్షతన పట్టణంలో సంఘ నాయకులు, సభ్యులతో శనివారం సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల సంఖ్య 25లక్షల మందికి పైగా ఉండగా కూటమి ప్రభుత్వం కేవలం 7లక్షలకు కుదించి లెక్క చూపుతోందన్నారు. కచ్చితమయిన లెక్కను చూపేందుకు తగిన కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. విశ్వబ్రాహ్మణులకు టీడీపీ ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోలేదని, ఇందుకోసం తాము తీవ్ర ఆవేదనలో ఉన్నామన్నారు. తమ కులానికి నష్టం కలిగించే జీఓ నంబరు 272ను సవరిస్తామన్న కూటమి ప్రభుత్వం దానిని పట్టించుకోలేదన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు, స్వర్ణకారుల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి అందలమెక్కిస్తామన్నారనీ, కానీ ఈ హామీపై కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ఇవే అమలు కాలేదంటే ఇక ఈ రెండింటినీ ఎంఎస్ఎంఈ పరిశ్రమల రంగానికి అనుసంధానం చేస్తామనడం మరింత మోసమయిందన్నారు. నారా లోకేష్ తమ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. పంచ వృత్తులు చేసుకునే విశ్వబ్రాహ్మణులందరినీ ఒకే సామాజిక వర్గంగా పరిగణించాలని, దీనిపై ప్రత్యేక జీవో జారీ చేయాలని కోరుతున్నామన్నారు. సమావేశంలో యువ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ములగపాటి బంగార్రాజు, ఉపాధ్యక్షుడు దనాల కోట శోభన్బాబు, గణేష్, జి.నారాయణ, త్రినాధ హరిబాబు, కంచుమోజు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మాట తప్పిన కూటమి ప్రభుత్వం
ఎమ్మెల్సీ ఇస్తామన్న లోకేష్ హామీ అమలు చేయాలి
విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు