
ఇక్కడి ఇసుక వద్దు... అక్రమ ఇసుకే ముద్దు..!
చిత్రంలోని ఇసుక నిల్వలు చూశారా... ఇవి బొబ్బిలి గ్రోత్ సెంటర్ వద్ద ప్రభుత్వం నిల్వ చేసిన ఇసుక. ఇక్కడ 9 వేల టన్నుల ఇసుక నిల్వ ఉంది. రవాణా చార్జీలు చెల్లించి ఇక్కడ నుంచి ఇసుకను తీసుకెళ్లాలి. అయితే, రవాణా చార్జీల పేరుతో అధిక డబ్బులు వసూలు చేయడంతో ఇక్కడ నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మరోవైపు నదుల్లో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుగుతుండడం వ్యాపారులకు కలిసివస్తోంది. ఇసుక నిల్వ కేంద్రాల వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేకపోతోంది. ఇసుక అక్రమ తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుండగా, అధికార పార్టీ నేతలకు మాత్రం ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక గ్రోత్ సెంటర్లో ఇసుక నిల్వలు ఉన్నాయని, వీటిని తీసుకెళ్లేందుకు ఎవరైనా వస్తే ఇస్తామని బొబ్బిలి ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామమోహనరావు తెలిపారు. – బొబ్బిలి