
కొందరికే కాదు... అందరికీ ఇవ్వాలి
విజయనగరం గంటస్తంభం:
తల్లికి వందనం పథకం కొందరికే కాదని, అర్హులైన విద్యార్థులందరికీ వర్తింపజేయాలని ఎస్ఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. నిబంధనల పేరుతో అధికమంది విద్యార్థులను అనర్హులుగా ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి నిరసనగా విజయనగరం మయూరి కూడలి నుంచి ఆర్టీసీ కాంపెక్స్ వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారం నిర్వహించి కూటమి ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.రాము మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే ఎటువంటి షరతులు లేకుండా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులున్నా అందరికీ రూ.15000 చొప్పున ఇస్తామని ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పుడు రూ.2వేలు కోతపెట్టి రూ.13వేలు ఇవ్వడం విచారకరమన్నారు. 300 యూనిట్లు విద్యుత్ వినియోగించిన వారికి, అతి తక్కువ జీతంతో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కుటుంబాల్లోని పిల్లలకు పథకాన్ని నిలిపివేయడం తగదన్నారు. ఒకే కుటుంబంలో పాఠశాల, డిగ్రీ చదివే విద్యార్థులు ఉంటే... ఒక్కరికి మాత్రమే ఏదైనా పథకం వర్తిస్తుందని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. తల్లికివందనానికి, ఫీజు రీయింబర్స్మెంట్కు ముడిపెట్టడం శోచనీయమన్నారు. గత ప్రభుత్వం తెలుపుకార్డు కలిగి ఉన్న పేదవిద్యార్థులందరికీ అమ్మఒడి పథకాన్ని వర్తింపజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎటువంటి షరతులు లేకుండా అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం కింద రూ.15000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తల్లిదండ్రులు, విద్యార్థులను ఐక్యంచేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు ఎం.వెంకీ, పి.రమేష్, రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్ వంశీ, ఆర్.శిరీష్, ఎస్.సోమేష్, జిల్లా నాయకులు భారతి, రమణ, నాని, జగదీష్, మురళి, చైతు, విద్యార్థులు పాల్గొన్నారు.

కొందరికే కాదు... అందరికీ ఇవ్వాలి