
విత్తన బస్తా రూ.1000..!
● అదనంగా బస్తాకు రూ.40 తీసుకుంటున్న వైనం
● విత్తన శుద్ధి ప్యాకెట్ ఇవ్వకుండానే వసూలు
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలోని కొన్ని రైతుసేవా కేంద్రాల్లో (రైతు భరోసా కేంద్రాలు) వరి విత్తన పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. విత్తన రకాలను బట్టి ధర నిర్ణయించారు. గతేడాదికి ఈ ఏడాదికి కొన్ని రకాల విత్తన ధర పెంపుపై రైతులు నిరసన తెలుపుతున్నారు. మరోవైపు విత్తనశుద్ధి ప్యాకెట్ పేరుతో అదనంగా రూ.40 వసూలు చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు సాగుసాయం అందజేయకపోగా... రైతుల నుంచి విత్తనాలకు అదనపు వసూళ్లకు పాల్పడడంపై ఆవేదన చెందుతున్నారు. ఎంటీయూ 1121 రకం విత్తనాలు 30 కేజీల బస్తాధర రూ.960కాగా విత్తన శుద్ధి ప్యాకెట్ సుడోమోనాస్ అందజేస్తామని మరో రూ.40 వసూలు చేస్తున్నారు. అయితే, విత్తన శుద్ధి ప్యాకెట్ ఇవ్వకుండా డబ్బులు వసూలుచేయడంపై పలు చోట్ల రైతులు నిలదీసినా ఫలితం లేకపోయింది. మొత్తం రూ.1000 ఇచ్చిన వారికే విత్తన బస్తాలు విక్రయించారంటూ రైతులు వాపోయారు.
జిల్లాలో వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 91 వేల హెక్టార్లు
జిల్లాలో వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 91వేల హెక్టార్లుగా వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి వ్యవసాయ అధికారులు 50,010 క్వింటాళ్లు విత్తనాలు జిల్లాకు కేటాయించారు. ఇప్పటి వరకు 30,350 క్వింటాళ్లు విత్తనాలు రైతు సేవ కేంద్రాల్లో పొజిషన్ చేశారు. మిగిలిన విత్తనాలు రావాల్సి ఉంది.
అదనపు వసూళ్లు చేయొద్దు
ఎంటీయూ 1121 రకం 30 కిలోల విత్తన బస్తా వాస్తవ ధర రూ.960 మాత్రమే. అయితే, విత్తనశుద్ధి చేయడానికి ఆసక్తి చూపే రైతులకు మాత్రమే రూ.40 విలువచేసే సుడోమోనస్ ప్యాకెట్ అందించాలి. రైతులు వద్దంటే విత్తనాలు మాత్రమే అందజేయాలని చెప్పాం. బలవంతంగా వసూలు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.
– వి.తారకరామారావు,
జిల్లా వ్యవసాయ అధికారి

విత్తన బస్తా రూ.1000..!

విత్తన బస్తా రూ.1000..!