
వేటకు వేళాయె..!
పూసపాటిరేగ:
వేటనిషేధం గడువు శుక్రవారంతో ముగిసింది. శనివారం నుంచి చేపలవేట సాగించవచ్చని మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు డీడీ విజయకృష్ణ పేర్కొన్నారు. ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో చేపలు, రొయ్యలు, తాబేళ్లు వంటి మత్స్యజాతులు గుడ్లుపెట్టి పొదిగే సమయంగా భావిస్తారు. మత్స్య సంపద వృద్ధిలో భాగంగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు వేట నిషేధం విధిస్తారు. చేపల వేటకు గ్రీన్సిగ్నల్ రావడంతో మత్స్యకారులు కోటి ఆశలతో సంద్రంలో వేట సాగించేందుకు సిద్ధమవుతున్నారు. వలలు, బోట్లు సిద్ధం చేసుకుంటున్నారు.
వేట సాగించేదిలా..
జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని 21 తీర గ్రామాల ప్రజలకు చేపలవేటే జీవనాధారం. చింతపల్లిలో 412 బోట్లు, తిప్పలవలసలో 226, పతివాడబర్రిపేటలో 163, కోనాడలో 4, తమ్మయ్యపాలెంలో 25, పులిగెడ్డలో 10, ముక్కాంలో 91, చోడిపల్లిపేట 38, కొండ్రాజుపాలెం 60, చేపలు కంచేరులోని మత్స్యకారులు 91 బోట్లతో వేట సాగిస్తారు. అయితే, వీరికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం డీజీల్ రాయితీలు వంటివి అందజేయకపోవడం, చింతపల్లి ఫ్లోటింగ్ జెట్టీ అందుబాటులోకి రాకపోవడంతో వేట కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతేడాది మత్స్యకార భృతిని కూడా ప్రభుత్వం ఎగ్గొట్టిందంటూ వాపోతున్నారు. ఈ ఏడాది ఇచ్చిన మత్స్యకార భరోసా కూడా అర్హులందరికీ అందలేదని మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు బి.చిన అప్పన్న ఆరోపించారు.
చింతపల్లి తీరంలో వేటకు సిద్ధం చేసిన బోట్లు
ముగిసిన వేట నిషేధం గడువు
నేటి నుంచి సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు సన్నద్ధం