
ముగిసిన టీచర్ల బదిలీ కౌన్సెలింగ్
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలు.. నిరసనలు.. బైఠాయింపులు.. కౌన్సెలింగ్ కేంద్రంలో ఖాకీల హడావిడితో చివరకు ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రాతిపదికన చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. 2,300 మంది ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలో బదిలీచేశారు. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగినా ఉన్నతాధికారుల సూచనల మేరకు క్లియర్ వేకెన్సీలు మాత్రమే భర్తీ చేశారు. క్లస్టర్ ఖాళీలు చూపించలేదు. చివరి రోజు 1,001 నుంచి ప్రారంభించిన కౌన్సెలింగ్ చివరి నంబర్ వరకు పూర్తి చేయాలనే ఉద్దేశంతో కౌన్సెలింగ్కు హాజరుకావాలని అందరికీ సమాచారం ఇచ్చారు. ఒకే రోజు దాదాపు వెయ్యిమందిని పిలవడంతో జిల్లా పరిషత్ సమావేశ మందిరం పరిసరాలు ఉపాధ్యాయులతో సందడిగా మారాయి. తాజాగా ఉన్న ఖాళీ స్థానాలన్నిటినీ తప్పనిసరి బదిలీ ఉపాధ్యాయులు కోరుకోవడంతో, రిక్వెస్ట్ బదిలీల ఉపాధ్యాయులు అధికంగా తమ స్థానాల్లోనే ఉండిపోయేందుకు సుముఖత తెలిపారు. 1,400 సీరియల్ ప్రారంభ సమయానికి మైదాన ప్రాంత మండలాల స్కూల్స్లో పోస్టులన్నీ భర్తీ అయిపోయాయి. మిగిలిన ఉపాధ్యాయులు ఏజెన్సీ మండలాలైన జీఎల్పురం, కురుపాం, కొమరాడ మండలాల సుదూర ప్రాంతాల స్కూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పలువురు మహిళా టీచర్లు ఆవేదన చెందారు. డీఈఓ యు.మాణిక్యంనాయుడు మాట్లాడుతూ క్లస్టర్ ఖాళీలను ఉన్నతాధికారుల సూచనల మేరకు చివరి వరకు చూపించలేదన్నారు. మిగిలిన 152 మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఖాకీల హడావిడిపై గురువుల గుర్రు
విజయనగరం క్రైమ్: ఉపాధ్యాయుల ఆందోళనల నేపథ్యంలో బందోబస్తు కావాలని డీఈఓ మాణిక్యంనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయ కౌన్సెలింగ్ కేంద్రం జెడ్పీ సమావేశ మందిరం వద్ద సీఐ శ్రీనివాస్, వన్టౌన్ ఎస్ఐలు రామగణేష్, రమణ, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. కౌన్సెలింగ్ కేంద్రంలో పోలీసులు తిష్టవేయడం, గురువులపై దురుసుగా వ్యవహరించడం, ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా ఉండి కౌన్సెలింగ్ కేంద్రంలోకి విడిచిపెట్టకపోవడం వంటి ఘటనలతో ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌన్సెలింగ్ విధానంలో స్పష్టమైన విధానాలను ప్రకటించకపోవడమే దీనికి కారణమని, ప్రభుత్వ లోపాలను విడిచిపెట్టి గురువులపై పోలీసులతో పెత్తనం సాగించాలని చూస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని కొందరు బహిరంగంగానే హెచ్చరించారు. ఎన్నడూ చూడని విధంగా ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ కేంద్రంలో పోలీసుల హడావిడిని తప్పుబట్టారు.
బదిలీ కౌన్సెలింగ్కు హాజరైన గురువులు
ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేసినా చూపించిన క్లస్టర్ ఖాళీలు
2,300 మంది ఎస్జీటీలకు బదిలీ

ముగిసిన టీచర్ల బదిలీ కౌన్సెలింగ్