
అత్యాచారం కేసులో ముద్దాయికి 12 ఏళ్ల జైలు శిక్ష
విజయనగరం క్రైమ్: ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ల కిందట నమోదైన అత్యాచా రం కేసులో ముద్దాయికి 12 ఏళ్ల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ జిల్లా మహిళా కోర్టు గురువారం తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ వకు ల్ జిందాల్ తెలిపారు. కేసు వివరాల్లోకి వెళితే.. మెంటాడ మండలం కుంటినవలసకు చెందిన మాదిరెడ్డి అప్పారావు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు 2023లో ఆండ్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అప్పటి ఎస్ఐ సిద్ధార్థ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం గజపతినగరం సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. అభియోగపత్రాన్ని ఎస్ఐ ప్రభాకర్ కోర్టులో దాఖలు చేశా రు. అప్పారావుపై నమోదైన కేసులో సాక్ష్యాలు రుజువు కావడంతో మహిళా కోర్టు ఐదవ అడిషనల్ జడ్జి పద్మావతి ముద్దాయికి శిక్ష ఖారారు చేస్తూ తీర్పు చెప్పారు. కేసులో నిందితునిపై నేరం రుజువయ్యేలా పోలీస్శాఖ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శకుంతల వాదనలు వినిపించగా, గజపతినగరం సీఐ రమణ, ఆండ్ర ఎస్ఐ సీతారాం కోర్టు కానిస్టేబుళ్లు సూర్యనారాయణ, సౌజన్యలు సకాలంలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారని ఎస్పీ చెప్పారు. వారిని అభినందించారు.
విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి
విజయనగరం: గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడంపై జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘోర దుర్ఘటన బాధాకరమన్నారు. విమానం హాస్టల్ భవనంపై కూలడంతో అధికమంది వైద్య విద్యార్థులు మృతి చెందడం, మరో 16 మంది తీవ్రంగా గాయపడడం హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. విమాన ప్రమాదాలను అరికట్టడంపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..!●
పార్వతీపురంటౌన్: సైబర్ నేరగాళ్లు పెట్టే ప్రలోభాలకు గురికావద్దని, వారు చేసే వివిధ మోసాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అపరిచితుల నుంచి వచ్చే మొబైల్ నంబర్లకు బదులివ్వవద్దని, డిజిటల్ అరెస్టులు లాంటివి లేవని కలెక్టర్ తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా చెప్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మొబైల్లో ఎలాంటి బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దని, వాటిని సోషల్ మీడియా ద్వారా ఇతరులకు షేర్ చేయొద్దన్నారు. అలా చేసి ఇబ్బందులు, లేనిపోని సమస్యలను కొనితెచ్చుకోవద్దని కలెక్టర్ హితవు పలికారు. బెట్టింగ్ యాప్లు ఉపయోగించినా, ఇతరులకు ప్రమోట్ చేసినా చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. మీరు లాటరీ గెలిచారు. మీకు పాస్వర్డ్ వస్తుంది. లేదా మీ మొబైల్కు వచ్చే పిన్ నంబర్ చెప్పండంటూ సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ వివరాలు ఎవరికి తెలియజేయవద్దని సూచించారు. స్క్రాచ్ చేయండి. రివార్డు పొందండి అని వచ్చే సందేశాలను క్లిక్ చేసి ఓపెన్ చేయవద్దని, ఏపీకే (ఏపీకె) పేరు మీద డాక్యుమెంట్ వస్తుందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయరాదని కలెక్టర్ వివరించారు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రలోభపెట్టే యాప్ల జోలికి వెళ్లొద్దన్నారు. ఏ అనుమానం వచ్చినా వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేయాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అత్యాచారం కేసులో ముద్దాయికి 12 ఏళ్ల జైలు శిక్ష