
మామిడి, పామాయిల్ మొక్కల ధ్వంసం
● కోటసీతారాం పురంలో ఏనుగుల తిష్ఠ
సీతానగరం: మండలంలో దట్టమైన తోటలు న్న కోట సీతారాంపురంలో నాలుగు రోజులుగా ఏనుగుల గుంపు తిష్ఠ వేశాయి. అల్లు వాసు, సూర్యనారాయణల మామిడితోటలో మామిడి కాయల కోసం మామిడి, పనస చెట్లను ధ్వంసం చేశాయి. ఆ పక్కనే ఉన్న మాదాసు శ్రీనివాసరావుకు చెందిన పామాయిల్ మొక్కలను నాశనం చేశాయి. దీంతో లక్షలు ఖర్చుచేసి మామిడి తోటను తయారు చేసి పంటకోతకు వచ్చే సమయానికి ఏనుగులు ధ్వంసం చేయడంతో అపారమైన నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పంటనష్టాన్ని అంచనావేసి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.
ఏనుగు పిల్లకు ‘సీత’గా నామకరణం
కోట సీతారాంపురం గ్రామంలో బుధవారం జన్మించిన ఏనుగు పిల్లకు ‘సీత’ అని ట్రాకర్స్, బీట్ అధికారులు, గ్రామస్తులు కలిసి నామకరణం చేశారు. 8 ఏనుగుల గుంపుతో కోట సీతారాంపురం వచ్చిన ఏనుగులు గుంపులో పెద్ద ఏనుగు శిశువుకు జన్మనివ్వడంతో ఏనుగుల గుంపు 9కి చేరింది. వీటి సంచారాన్ని ట్రాకర్స్ గమనిస్తున్నారు.