
ఆన్లైన్లోనే సహకారం
● అన్ని సహకార సంఘాల్లోనూ
డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి
● పీఏసీఎస్ల సేవల్లో పారదర్శకతకు
అవకాశం
విజయనగరం అర్బన్:
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపేతానికి, అక్రమాల నిరోధానికి గత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సాంకేతికత చర్యలు ఫలించాయి. కేంద్ర ప్రాయోజిత పథకం కింద సహకార సంఘాల కంప్యూటరీకరణ ప్రక్రియ ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అన్ని సంఘాల్లోనూ పూర్తయింది. ఖాతాదారులకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దశాబ్దాల కిందట సభ్యత్వం తీసుకున్న రైతులు, రుణాల వివరాలను ఆన్లైన్ చేశారు. గతేడాది మార్చి నెలాఖరుకు ఆడిట్ నివేదికలో ఉన్న బ్యాలెన్స్ ఓచర్లు నమోదు చేశారు.
డిజిటలైజేషన్ పూర్తి
ఉమ్మడి విజయనగరం జిల్లాలో లాభాలు, నష్టాల్లో నడుస్తున్న అన్ని సహకార సంఘాలను డిజిటలైజేషన్ పూర్తి చేశారు. విజయనగరం జిల్లాలో 94, పార్వతీపురంలోని 64 సంఘాల్లో దాదాపు 5 లక్షల మంది రైతులు సభ్యులుగా నమోదయ్యారు. ఇటీవల చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ తరువాత 1.4 లక్షల మంది మాత్రమే పక్కా ఆన్లైన్ సేవలకు అర్హులైన రైతులుగా నిర్ధారించారు. కొన్నేళ్లుగా రైతులు పొందుతున్న సేవల ఆధారంగా తుది జాబితాను ఖరారు చేశారు.
అక్రమాలకు చెక్
సహకార సంఘాల్లో క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది రుణాల కోసం పర్సంటేజీలు వసూలు చేస్తు న్నారు. 30 శాతానికిపైగా సొసైటీల్లో రైతులు రుణ చెల్లింపులు చేసిన వెంటనేకాకుండా కొందరు సహకార సిబ్బంది తమ అవసరాలకు డబ్బులు వాడుకొని నిదానంగా జమ చేయడం, మరికొందరు సొమ్మును దుర్వినియోగం చేసి రైతులు చెల్లించలేదంటూ మాయచేసిన ఘటనలు గతంలో కనిపించేవి. ఇకపై అలాంటి వాటికి అడ్డుకట్ట పడనుంది. డిజిటలైజేషన్ పూర్తయితే బ్యాలెన్స్, ముగింపు నిల్వల వివరాలు పక్కాగా ఉంటాయి. పాత తేదీలకు నమోదుచేసే అవకాశం ఉండదు. రైతు నగదు చెల్లించిన రోజే ఖాతాలో జమచేయాలి. సొసైటీ ఇచ్చిన అప్పులు, రుణ గ్రహీతల వివరాలు, చెల్లింపులు పూర్తి వివరాలను ఆన్లైన్లో తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ప్రాథమిక సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్న సభ్యుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన తరువాత ఉమ్మడి విజయనగరం జిల్లా స్థాయిలో 1.4 లక్షల మంది సభ్యత్వం ఉన్న సంఘాలుగా ఖరారయ్యాయి. ఈ–ప్యాక్స్ డిజిటలైజేషన్ ప్రక్రియ శతశాతం సంఘాల్లో పూర్తయింది. ఆన్లైన్ కంప్యూటరీకరణ నేపథ్యంలో లావాదేవీలన్నీ పారదర్శకంగా జరగనున్నాయి. ఈ సొసైటీల్లో ఆన్లైన్ సేవలు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల తరహాలో బ్యాంకింగ్ ప్రక్రియ సాగనుంది.
– సీహెచ్ ఉమామహేశ్వరరావు, సీఈఓ, డీసీసీబీ

ఆన్లైన్లోనే సహకారం

ఆన్లైన్లోనే సహకారం