నిరుపయోగంగా ఉన్న ఎంఎస్ఎంఈ పార్కుకు కేటాయించిన భూములు
రామభద్రపురం:
అదిగో ఉద్యోగం.. ఇదిగో నిరుద్యోభృతి.. అదిగదిగో పరిశ్రమలు వచ్చేస్తున్నాయంటూ ప్రచారం చేయడం.. హడావిడిగా శంకుస్థాపనలు చేయడం.. ఆ తర్వాత మిన్నకుండడం.. నమ్మిన నిరుద్యోగులను, ప్రజలను మోసంచేయడం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు వెన్నతోపెట్టిన విద్య అన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. ఊరించడం.. ఉసూరుమనిపించడం తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం, ఔత్సాహికులను ప్రోత్సహించడంలో ఏ ఒక్కరిలోనూ, ఒక్కచోట పరి‘శ్రమ’ కనిపించదు. దీనికి 11 నెలల కిందట రామభద్రపురం మండలం కొట్టక్కి రెవెన్యూ పరిధిలోని కాకర్లవలస వద్ద ఏపీఐఐసీకి చెందిన 20 ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసిన ఎంఎస్ఎంఈ పార్క్ నిలువెత్తు నిదర్శనం. పరిశ్రమలు వచ్చేస్తున్నాయని, ఈ ప్రాంతానికి చెందిన వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు స్థానిక ఎమ్మెల్యే బేబినాయిన, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఊదరగొట్టారు. తీరా చూస్తే ఒక్క యూనిట్ కూడా ఏర్పాటుకాలేదు. మరోవైపు ఇప్పటికీ ముళ్లచెట్లతోనే ఆ స్థలాలు దర్శనమిస్తుండడం పాలకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి.
మరింత భూమి సేకరణకు సన్నాహాలు..
ఎంఎస్ఎంఈ పార్కులో ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ ఏర్పాటుకాకపోగా మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం.. మరింత భూమిని సేకరించాలని నిర్ణయించడంపై ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల 3వ తేదీన రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజు, కలెక్టర్ రాంసుందరరెడ్డి, జేసీ సేతు మాధవన్ తదితరులు కారకర్లవలస వద్ద డీ పట్టా భూములు పరిశీంచారు. ప్రభుత్వ భూమి లేకుంటే జిరాయితీ భూములు కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని ఆర్డీవో, తహసీల్దార్లకు సూచించినట్లు తెలిసింది. ఇదే విషయంపై రామభద్రపురం తహసీల్దార్ అజురఫీజాన్ స్పందిస్తూ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వానికి రూ.7.48 కోట్లు డబ్బులు ఇచ్చి ఏపీఐఐసీ భూములు కోనుగోలు చేసిందన్నారు. ఆ భూములు ఏపీఐఐసీకి చెందుతాయని, మళ్లీ రైతులు పరిహారం అడగడం సబబుకాదన్నారు.
ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపనే తప్ప పరిశ్రమల ఏర్పాటుకు నేతల చొరవ శూన్యం
11 నెలల్లో ఒక్క యూనిట్ ఏర్పాటుకాని వైనం
రోడ్లు, కాలువల కోసం రూ.7కోట్లు నిధులు మంజూరు
ఒక్క అడుగు ముందుకు కదలని
అభివృద్ధి పనులు
ముళ్లచెట్లతో దర్శనమిస్తున్న కాకర్లవలస ఎంఎస్ఎంఈ పార్క్
పాలకుల వైఫల్యానికి నిలువెత్తు
నిదర్శనంగా భూములు
రామభద్రపురం మండలం కొట్టక్కి రెవెన్యూ... మిర్తివలస పంచాయతీ పరిధిలోని కాకర్లవలస, కారేడువలస గ్రామాల మధ్య 2017లో సుమారు 187.08 ఎకరాల భూమిని రూ.7.48 కోట్లకు ఏపీఐఐసీకి అప్పగించింది. సుమారు ఏడాది కిందట చంద్రబాబు ప్రభుత్వం ఏపీఐఐసీకి సంబంధించిన భూమిలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కోసం 20 ఎకరాల భూమిని కేటాయించిది. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం, ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుచేసి చిన్న పెద్ద పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామంటూ గతేడాది మే నెల 10వ తేదీన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు హడావుడి చేశారు. 300 చదరపు గజాలతో 139 ప్లాట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రోడ్లు, కాలువల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.7 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు ప్రకటించారు. అయితే, పార్క్ అభివృద్ధికి చిన్నపనికూడా చేపట్టకపోవడం గమనార్హం. 50 శాతం రాయితీపై పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయిస్తామని ఏపీఐఐసీ ప్రకటించినా ఆసక్తిచూపేవారు కరువయ్యారు. మరోవైపు పరిశ్రమల కోసం భూములు సేకరించి ఏళ్లతరబడి వృథాగా విడిచిపెట్టడం, తమ కుటుంబాల్లోని నిరుద్యోగులకు ఉపాధి చూపలేదంటూ ఆ భూములను గిరిజన రైతులు సాగుచేయడం ఆరంభించారు. ఈ వివాదం కొనసాగుతోంది.


