రూ.27 లక్షలతో 3 స్పీడ్ లేజర్ గన్స్
సీఎస్సార్ కింద అందజేసిన సంస్థలు
ఏఐ, ఎన్ఐసీతో రియల్టైమ్
కాంటాక్ట్లెస్ చలానాలు
మీడియా సమావేశంలో
సీపీ శంఖబ్రత బాగ్చి
అల్లిపురం: నగరంలో వాహనాల సంఖ్యతోపాటు ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతోంది. కొందరు వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం, తీవ్ర గాయాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లంఘనలను మరింత సమర్థవంతంగా గుర్తించి, చర్యలు తీసుకునేందుకు ఎలక్ట్రానిక్ ఆధారిత ఎన్ఫోర్స్మెంట్పై పోలీసులు దృష్టి సారించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించిన వివరాలు..
రూ.27 లక్షలతో 3 స్పీడ్ గన్స్
వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ను మరింత పటిష్టం చేసేందుకు సౌత్ ఏషియా ఎల్పీజీ కంపెనీ ప్రై.లి.ను సీపీ శంఖభ్రత బాగ్చి సంప్రదించారు. స్పందించిన సంస్థ సీఎస్సార్ కింద సుమారు రూ.18 లక్షల విలువైన రెండు స్పీడ్ లేజర్ గన్స్ను అందజేసింది. అదానీ గంగవరం పోర్ట్ ప్రై.లి. సీఎస్సార్ కింద సుమారు రూ.9 లక్షల విలువైన మరో స్పీడ్ లేజర్ గన్ను అందించింది.
100 మీటర్ల దూరం నుంచే..
ఈ స్పీడ్ లేజర్ గన్స్ ద్వారా సుమారు 100 మీటర్ల దూరం నుంచే ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి వాహన వివరాలను నిక్షిప్తం చేయవచ్చు. అతివేగం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం, పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్, వ్యతిరేక మార్గంలో వాహనం నడపడం తదితర ఉల్లంఘనలను గుర్తించి చలానాలు విధించనున్నారు.
ఏఐతో రియల్టైమ్ చలానాలు
మూడు స్పీడ్ లేజర్ గన్స్ను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(ఎన్ఐసీ) ద్వారా అనుసంధానించనున్నారు. ఏఐ ఆధారంగా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి రియల్టైమ్లో కాంటాక్ట్లెస్ చలానాలు విధించేలా వ్యవస్థను వినియోగించనున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణతోపాటు నగర ట్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడనుంది. ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సీఎస్సార్ ద్వారా సహకారం అందించిన సౌత్ ఏషియా ఎల్పీజీ కంపెనీ, అదానీ గంగవరం పోర్ట్ సంస్థలకు సిటీ పోలీసుల తరఫున సీపీ కృతజ్ఞతలు తెలిపారు.


