మార్ఫింగ్ ఫొటోలు
పోస్టు చేసిన ఇద్దరి అరెస్ట్
అల్లిపురం: ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి మహిళా డ్యాన్సర్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు చేసిన ఇద్దరిని విశాఖ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. విశాఖపట్నం చినగంట్యాడకు చెందిన నెట్టెం శంకర్ సాయి శ్రీకాంత్(31), శ్రీకాకుళం జిల్లాకు చెందిన జరుగుల్ల జ్యోతి ప్రసాద్రావు(25)లను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కక్షలు, అసూయకు గురై డ్యాన్స్ ఈవెంట్స్ నిర్వాహకుడి ఫొటోతో ఫేక్ ఖాతా సృష్టించి, మహిళా డ్యాన్సర్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేసినట్లు దర్యాప్తులో తేలింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సోషల్ మీడియా ఖాతాలు, మొబైల్ నంబర్లు, ఇతర డిజిటల్ ఆధారాలను విశ్లేషించి నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. సోషల్ మీడియాలో ఇతరుల ఫొటోలు, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం, ఏఐ ద్వారా ఫొటోలు, వీడియోల మార్ఫింగ్, అసభ్యకర, తప్పుడు కంటెంట్ ప్రచారం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు. సైబర్ వేధింపులకు గురైతే వెంటనే 1930 ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
జరుగుల్ల జ్యోతి ప్రసాద్రావు
నెట్టెం శంకర్ సాయి శ్రీకాంత్


