రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
అల్లిపురం: కోవిడ్ అనంతరం సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయని, వాటి నియంత్రణకు రాష్ట్ర ప్రభు త్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని రాష్ట్ర హోం మంత్రి అనిత తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సైబర్ క్రైమ్ రీఫండ్ మేళా–3.0లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలకు గురైన 310 మంది బాధితులకు రూ.6,02,41,725 విలువైన రీఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ సైబర్ మోసాలకు గురైన వెంటనే బాధితులు 1930 హెల్ప్లైన్కు కాల్ చేయడం లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా తమ డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచించారు. నగర సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ రీఫండ్ మేళాల ద్వారా ఇప్పటివరకు మూడు దశల్లో మొత్తం 1,550 మంది బాధితులకు రూ.28.49 కోట్లకు పైగా నష్టపరిహారాన్ని తిరిగి అందజేశామన్నారు. అదేవిధంగా జాబ్ ఫ్రాడ్లు, టాస్క్ గేమ్ మోసాలు, లోన్ యాప్ మోసాలు, వాహన విక్రయ మోసాలు, ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్లపై చర్యలు చేపట్టి కోట్లాది రూపాయలను రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేశామన్నారు.


