గ్రామగ్రామాన ఆధ్యాత్మిక వెలుగు | - | Sakshi
Sakshi News home page

గ్రామగ్రామాన ఆధ్యాత్మిక వెలుగు

Jun 30 2026 12:13 AM | Updated on Jun 30 2026 12:13 AM

● చివరి దశలో 429 ఆలయాల నిర్మాణం ● శ్రీవాణి ట్రస్టు నిధులతో పనులు

మహారాణిపేట: ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణాన్ని విస్తరింపజేయడమే లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సమాజంలో వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలతో పాటు మత్స్యకార నివాస ప్రాంతాలలో ఆలయాలను నిర్మించడానికి అప్పట్లో ఒక బృహత్తర ప్రణాళికను రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేశారు. నిరుపేద ప్రాంతాలలో సైతం భగవత్‌ చింతన పెరగాలనే సత్సంకల్పంతో, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ప్రముఖ శ్రీవాణి ట్రస్టు ద్వారా ఒక్కొక్క దేవాలయ నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో మొత్తం 429 దేవాలయాలను నిర్మించడానికి పరిపాలనాపరమైన ఆమోదం లభించగా, ప్రస్తుతం ఈ ఆలయాల నిర్మాణాలు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి.

రాష్ట్రంలో హిందూ దేవాలయాల అభివృద్ధికి గత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు, అప్పటి దేవదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పనులకు మోక్షం లభించింది. శ్రీవాణి ట్రస్టు నిధులు సకాలంలో విడుదల కావడంతో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే నెల 15వ తేదీ నాటికి నిర్దేశించుకున్న అన్ని దేవాలయాల పనులను వంద శాతం పూర్తి చేసి, భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో అధికారులు, కాంట్రాక్టర్లు శ్రమిస్తున్నారు.

పారదర్శకంగా పనులు

ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాల ప్రకా రం.. మంజూరైన రూ.10 లక్షల నిధులను అత్యంత పారదర్శకంగా ఖర్చు చేస్తున్నారు. ఈ నిధులలో ఆలయ ప్రాంగణం, గర్భాలయ నిర్మాణ పనుల కోసం రూ.8 లక్షలు వినియోగిస్తుండగా, సదరు దే వాలయంలో ప్రతిష్టించబోయే దేవతామూర్తుల విగ్ర హాల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా రూ.2 లక్షలను ఖర్చు చేయాలని నిబంధనలలో పొందుపరిచారు.

ఆలయాల నిర్మాణం పూర్తి

ప్రభుత్వ నిబంధనలకు లోబడి అన్ని ఆలయాల నిర్మాణ పనులను ప్రారంభించి కేవలం 11 నెలల కాలంలోనే పూర్తి చేశాం. జిల్లా పరిధిలోని ఆనందపురం మండలంలో రెండు గ్రామాలు, పద్మనాభం మండలంలో మూడు గ్రామాలు, పెందుర్తి మండలంలో ఒక గ్రామంలో ఈ ఆలయాల నిర్మాణాలు పూర్తయ్యాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఆలయాలను త్వరలోనే ఉన్నతాధికారులకు అప్పగించనున్నాం.

–సీహెచ్‌వీ రమణ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం

రెండు దశల్లో పనులు

వీటిని రెండు దశల్లో చేపట్టగా, మొదటి దశలో పెందుర్తి మండలం చీమాలపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టిన సంతాన వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఇక రెండో దశలో భాగంగా ఆనందపురం మండలంలోని సర్లపాలెం గ్రామాలలో శ్రీ రామాలయాల పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు ఆనందపురం మండలం గొంతివానిపాలెం గ్రామంలోని శ్రీ దుర్గాలమ్మ దేవాలయం, గోరింట గ్రామంలో వెలిసిన శ్రీ పరదేశమ్మ గ్రామ దేవత దేవాలయం, ఆరిగిమెరిక గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, గంభీరం పరిధిలోని శ్రీ బంగారమ్మ తల్లి దేవాలయం, యర్రివానిపాలెం గ్రామంలోని శ్రీ దుర్గాలమ్మ గ్రామ దేవత ఆలయంతో పాటు గొల్లల కనమామ్‌ గ్రామంలో నిర్మించిన శ్రీ రాములవారి ఆలయ పనులు పూర్తయ్యాయని సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రాంబాబు వెల్లడించారు.

జిల్లాల వారీగా పరిశీలిస్తే..

విశాఖ జిల్లాలో అత్యధికంగా 263 దేవాలయాలు, శ్రీకాకుళం జిల్లాలో 108, విజయనగరం జిల్లాలో 58 ఆలయాల నిర్మాణ బాధ్యతలను ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాల ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లకు అప్పగించారు. ఇందులో భాగంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన 166 దేవాలయాల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఈఈ సీహెచ్‌.వి. రమణకు అప్పగించగా, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని 263 దేవాలయాల నిర్మాణ బాధ్యతలను సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement