ప్రపంచం ఏఐ టెక్నాలజీతో దూసుకుపోతున్నా, విశాఖ బీచ్ రోడ్డులో వృద్ధ కార్మికుల బతుకులు మాత్రం ఇంకా మ్యాన్హోల్ చీకట్లోనే మగ్గుతున్నాయి. కోస్టల్ బ్యాటరీ నుంచి ఫిషింగ్ హార్బర్ వెళ్లే మార్గంలో చెత్తతో నిండిన ఒక మ్యాన్హోల్ను శుభ్రం చేయడానికి వృద్ధ కార్మికులు ఎలాంటి రక్షణ లేకుండా నిచ్చెన వేసుకుని లోపలికి దిగారు. ఆధునిక యంత్రాలున్నా పాత పద్ధతిలోనే ప్రాణాలను పణంగా పెట్టి వారు పనిచేస్తున్నారు. లోపల ఊపిరి అందక ఓ వృద్ధుడు తల్లడిల్లుతూ నిచ్చెన సాయంతో పైకి వస్తున్న దృశ్యం కలచివేసింది. ఇంత జరుగుతున్నా జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. –ఫొటోలు :సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


