పంచగ్రామాల భూసమస్యను పరిష్కరించాలి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపాటు
సాక్షి, విశాఖపట్నం: ఉండవల్లిలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడితే.. రివర్స్లో తమ పార్టీ నాయకులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతి, అప్పులు, రైతుల సమస్యలు ప్రజల దృష్టికి రాకుండా చేయడానికే ఈ దాడులను ప్రోత్సహించారని విమర్శించారు. రాళ్లతో పోలీసులపై దాడి చేసిన వారిని వదిలేసి, తమపై అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల ఆహ్వానం మేరకే తాము అక్కడకు వెళ్లామన్నారు. పెనుమాకలో భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి నీటిని మళ్లిస్తూ, మట్టి తవ్వకాలు, కాలువలు, రహదారుల పేరుతో వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. రైతుల అనుమతి లేకుండానే వారి భూములను రికార్డుల్లో ప్లాట్లుగా చూపించి రిజిస్ట్రేషన్లు చేశారని, కొంతమంది పోలీసు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అమరావ తి నిర్మాణం పేరుతో మట్టి, ఇసుక, గ్రావెల్ దోపిడీ జరుగుతోందని, ఈ దాడి ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల న్యాయపోరాటానికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందన్నారు.


