వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
సత్యకుమార్ యాదవ్
మహారాణిపేట: పోలియో రహిత భారతదేశాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి, ఎంపీ ఎం. శ్రీభరత్, ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్తో కలిసి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30 వేల బూత్లు, 1,200 మొబైల్ బృందాల ద్వారా వ్యాక్సినేషన్ చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పర్యవేక్షణలో అర్బన్లో 884, రూరల్లో 178 కలిపి మొత్తం 1,062 కేంద్రాలు, 94 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 0–5 ఏళ్ల వయస్సు గల 1,89,712 మంది చిన్నారులకు గాను రాత్రి 7 గంటల సమయానికి 92.84 శాతం మంది (1,76,136 మంది) కి పోలియో చుక్కలు వేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. ఈ ప్రక్రియలో 4,518 మంది వ్యాక్సినేటర్లు, 120 మంది సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఆదివారం చుక్కల మందు వేసుకోని చిన్నారుల కోసం సోమ, మంగళవారాల్లో సిబ్బంది ద్వారా 6,51,702 ఇళ్లలో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆయన వివరించారు.


