మహారాణిపేట: భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు. ఆదివారం విశాఖలో అఖిల బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పీవీ 105వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, ఆయనపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ.. పీవీ దేశానికి చేసిన సేవలను గుర్తించి బీజేపీ ప్రభుత్వం ఆయనకు అత్యున్నత ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించి గౌరవించిందన్నారు. ఎంపీ ఎం. శ్రీభరత్ మాట్లాడుతూ.. పీవీ తెచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల విదేశాలకు వెళ్లిన మేధావులు మళ్లీ భారత్కు తిరిగి రావాలని కోరారు. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ మాట్లాడుతూ.. పీవీ ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి ప్రపంచం మెచ్చిన ఆర్థిక మేధావిగా ఎదిగారని కొనియాడారు. పీవీ వద్ద ఆరేళ్లు ప్రత్యేక అధికారిగా పనిచేసిన ప్రసాద్ ఆయన జీవనశైలిని వివరించగా.. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పీ.వీ. నారాయణరావు మాట్లాడుతూ పీవీ 16 భాషలు తెలిసిన బహుభాషా కోవిదుడని గుర్తుచేశారు. కార్యక్రమంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్యసేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్, సుహాసిని ఆనంద్, ద్రోణంరాజు శ్రీవాత్సవ్, చెరువు రామకోటయ్య, కావూరు చరణ్కుమార్, గంటి రవికుమార్ తదితరులు పాల్గొని పీవీ సేవలను కొనియాడారు.


