డాబాగార్డెన్స్: ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో కృత్రిమ మేధ విస్తృతంగా వినియోగంలో ఉందని అమెరికాకు చెందిన లియో డస్ ఇట్ సంస్థ ప్రతినిధి, ‘లీడర్షిప్ విత్ ఏఐ’ సర్టిఫైడ్ నిపుణుడు, పరిశోధకుడు భరత్ తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఆదివారం లియో డస్ ఇట్ సంస్థ ఆధ్వర్యంలో ఏఐపై ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఏఐ పాత్రను వివరించారు. వివిధ సంస్థల్లో ఏఐని ఎలా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చో ప్రదర్శనల ద్వారా వివరించారు. అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ఏఐ వినియోగం విస్తృతంగా జరుగుతోందని, అభివృద్ధి రంగంలో విప్లవాత్మక మార్పులకు ఏఐ దోహదపడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి ఉదయ్ శంకర్ బృందంతో పాటు నగరానికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్లు, వైద్యులు, వ్యాపారవేత్తలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, స్టెమ్ కోఆర్డినేటర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


