రెండేళ్లలో వ్యక్తిగత దూషణలు చేయడమే హోంమంత్రి డ్యూటీ మాజీ సీఎం జగన్ను, మాజీ మంత్రిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు అనితకు గుడివాడ అమర్నాథ్ గురించి మాట్లాడే అర్హత లేదు వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు పల్లా చినతల్లి, శ్రీదేవివర్మ మండిపాటు
మహారాణిపేట: రాష్ట్ర హోంమంత్రి పదవిని నిర్వహించడానికి వంగలపూడి అనిత ఏమాత్రం అర్హురాలు కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నేతలు పల్లా చినతల్లి, శ్రీదేవివర్మ ధ్వజమెత్తారు. సోమవారం మద్దిలపాలెంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అనిత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మహిళల భద్రత, శాంతిభద్రతలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
సొంత నియోజకవర్గంలోనే భద్రత శూన్యం : హోంమంత్రి అనిత తన సొంత నియోజకవర్గంలోనే శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని ఆరోపించారు. అక్కడ జ్ఞానేశ్వరి అనే మూడేళ్ల చిన్నారి కనిపించకుండా పోయి 10 రోజులు దాటినా ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మహిళల పట్ల గౌరవం అనేది కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని హితవుపలికారు.
గుడివాడపై వ్యాఖ్యలు దారుణం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై హోంమంత్రి అనిత బాధ్యతారాహిత్యంగా, అనుచిత విమర్శలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన హోంమంత్రి పదవిని కాపాడుకోవడం కోసమే ఆమె ఇటువంటి చౌకబారు విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ అమర్నాథ్ కుటుంబానికి విశాఖ జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉందని గుర్తు చేశారు. అటువంటి కుటుంబ నేపథ్యం ఉన్న నేతను అవమానించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమన్నారు.
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే..
రాష్ట్రంలో నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, మహిళలకు భద్రత లేకపో వడం, సంక్షేమ పథకాల వైఫల్యాలు వంటి అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కూటమి ప్రభుత్వం, హోంమంత్రి అనిత వైఎస్సార్సీపీ నేతలపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నా రని విమర్శించారు. అమర్నాథ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను హోంమంత్రి అనిత వెంటనే ఉపసంహరించుకుని, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పా లని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జియ్యాని వెంకట సత్య, జిల్లా అంగన్వాడీ విభాగం ఉపాధ్యక్షురాలు ఇప్పిలి పార్వతి పాల్గొన్నారు.


