మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందే వినతులపై సమగ్ర విచారణ జరిపి, సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంక్లిష్టమైన ఫిర్యాదులను అధికారులు స్వయంగా పరిశీలించి నివేదికలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని, బాధ్యత నుంచి తప్పుకోవద్దని స్పష్టం చేశారు. ప్రజల నుంచి మొత్తం 325 వినతులు రాగా.. వాటిలో రెవెన్యూ శాఖవి 104, జీవీఎంసీవి 68, పోలీసు శాఖవి 34, ఇతర శాఖలవి 119 ఉన్నాయి. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇన్చార్జ్ డీఆర్వో గోవిందు, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, ఏడీసీ సత్యవేణి తదితరులు వినతులు స్వీకరించారు.
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 115 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి మొత్తం 115 వినతులు అందాయి. జీవీఎంసీ అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మలతో కలిసి కమిషనర్ కేతన్గార్గ్ అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన వినతులలో పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధికంగా 49 వినతులు రాగా.. ఇంజనీరింగ్ సెక్షన్కు 28, రెవెన్యూ సెక్షన్కు 21, ప్రజారోగ్య విభాగానికి 8 , ఇతర విభాగాలకు మరో 9 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, జాయింట్ డైరక్టర్ డి.విజయభారతి, ప్రధాన ఇంజనీర్ పీవీవీ సత్యనారాయణరాజు, కార్యదర్శి రమణ తదితర అధికారులు పాల్గొన్నారు.


