ఏయూక్యాంపస్: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు ముగిసి, శాంతి పరిస్థితులు నెలకొనాలనే ఉద్దేశంతో ఇస్కాన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్లో బుధవారం మహా హరినామ సంకీర్తన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన 500 మందికి పైగా బ్రహ్మచారులు, సన్యాసులు పాల్గొని ఆధ్యాత్మికోత్సాహాన్ని నింపారు. ఇస్కాన్ మందిర దర్శనం అనంతరం ఆర్కే బీచ్ నుంచి ప్రారంభమైన ఈ సంకీర్తన యాత్ర పార్క్ హోటల్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పాల్గొని హరినామ సంకీర్తన విశిష్టతను కొనియాడారు. సాయంత్రం ఎంజీఎం పార్క్లో నిర్వహించిన భజన క్లబ్బింగ్ భక్తుల హృదయాల్లో శాంతి, ఆనందాలను నింపింది. ప్రపంచం అశాంతి, అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో.. యుద్ధాలకు ముగింపు పలకాలని, విశ్వ సౌభ్రాతృత్వం, శాశ్వత శాంతి కలగాలని కోరుతూ చేసిన వినమ్ర ప్రార్థనే ఈ మహా సంకీర్తన అని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో జయపతాక స్వామి మహారాజ్, ఇస్కాన్ విశాఖ అధ్యక్షుడు సాంబదాస్ తదితరులు పాల్గొన్నారు.


